22, మే 2013, బుధవారం

శ్రీ పరమాచార్య వాణి - గురువైభవం

"గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడికి, గురువుకి ఒక్కటే తేడా. ఈశ్వరుడు సృష్ఠి, స్థితి లయములనే మూడు పనులు చేస్తూ ఉంటారు, గురువు ఈ మూడూ చెయ్యనవసరంలేదు. మనం గురువు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచితే, భగవంతుడిలో చేర్చేందుకు కావలసిన జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. మనకి ఒక గురువు లభించనప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా భగవంతుని పాదములు పట్టుకోవాలి".

పైన చెప్పిన పరమాచార్య స్వామి వారి బోధను చదివాక మరియు పూజ్య గురువు గారి వాక్కుల నుంచి నాకు అర్ధం అయిన సారాంశం...


"అందుకే కదా గురుర్బ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని కదా గురుగీతలో శంకరుడు చెప్పారు. త్రిమూర్త్యాత్మకుడైన గురువుని నమ్మితే, గురువు యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడిలో కలిసేలా చేస్తాడు. అదే మనకి గురువు లభించకపోతే, తదేక దీక్షతో మన ఇలవేల్పు/కులదైవాన్ని/ఇష్టదైవాన్ని అనన్య భక్తితో కొలుస్తూ ఉంటే, ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు, ఒకనాడు తానే స్వయంగా గురువు రూపంలో వచ్చి, మనకి జ్ఞాన భిక్ష పెట్టి మనల్ని అంత్యమున ఆయనలో చేర్చుకుంటాడు. అంటే గురువు లభించాక భగవంతుడిని పూజించనక్కరలేదు అని కాదు దీని భావం, గురువు లభించని పూర్వం మనం చేసే పూజతో పోలిస్తే, గురువు లభించిన తర్వాత మనం చేసే పూజలో ఊహించలేనంత ఉన్నతి ఉంటుంది. గురువు లభించిన తర్వాత, ప్రత్యక్షంగా గురువుకి చేసే సేవ మరియు గురుబోధలననుసరించి, మనం చేసే వైదిక కర్మాచరణ అన్నీ పరిపూర్ణత్వం పొంది,  తద్వారా, గురువు అనుగ్రహంతో చిత్తశుద్ధి కలిగి, ఆపై గురువు అనుగ్రహంతోనే జ్ఞానం పొందడానికి అర్హత లభిస్తుంది."

న గురోరధికం న గురోరధికం న గురోరధికం నగురోరధికం
శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

1 కామెంట్‌:

  1. మీరు శ్రీ పరమాచార్య వాణి అనే పేరుతో రాసిన వన్నీ ఇక్కడ బ్లాగులో కూడా ప్రచురించగలరు. అవి వేరొకరితో షేర్ చెయ్యడానికి వీలుగా ఉంటుంది. గూగుల్ సెర్చ్ లో కూడా అందరికీ దొరుకుతాయి

    రిప్లయితొలగించండి