26, మే 2013, ఆదివారం

శ్రీ పరమాచార్య వాణి - నిత్య సత్కర్మాచరణ ఆవకశ్యత

"మన వద్ద ఒక రాగి పాత్ర ఉన్నదనుకోండి, దానిని ఈ రోజు శుభ్రం చేస్తే తళ తళా మెరుస్తుంది, మరి రేపు లేక ఎల్లుండి మాటేమిటి? రాగి పాత్రని ప్రతీ రోజూ శుభ్రం చేయకపోతే, మళ్ళీ మలినం పట్టినట్లుగా, మన మనసు కూడా ప్రతీ రోజూ మనం విహితకర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మన మనసు మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మాచరణము చేయగా చేయగా, ఒకనాడు చిత్తశుద్ది ఏర్పడి, ఆపైన ఆత్మ దర్శనం అవుతుంది. అలా ఒక్కసారి ఆత్మదర్శనం పొందాక, ఇక ఇలా ప్రతీ రోజూ విహితకర్మాచరణ, సత్కర్మలు వగైరా ఏమీ చేయనక్కరలేదు. కానీ ఆ స్థితిని పొందేవరకు వేదం చెప్పినట్లుగా విహిత కర్మలు, సత్కర్మలు చేయవలసినదే".

ఈ విషయమై, పూజ్య గురువు గారి వాక్కుల నుంచి, నాకు గుర్తు ఉన్న సారాంశం...

"అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడ్డ మహాపురుషులు మన ఈ భరత ఖండములో అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి భగవాన్ రమణులు. రమణుల వంటి మహాపురుషులు ఏమి చెప్తారో అది మనకి శిరోధార్యం తప్ప, రమణులు చేసినవన్నీ మనకి ఆచరణీయము కావు. వారు తురీయావస్థని దాటి ఉన్న మహాత్ముడు, ఆయనలా మనం చేయాలనుకోవడం తప్పు. అందుకే మహాత్ములను ఎన్నటికీ అనుకరించవద్దు. మహాత్ములు చెప్పిన బోధలను మనం ఆచరణలో పెడితే చాలు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేయరు అని నాబోటి అల్పుడు వారిని చూసి, నేను కూడా ఉన్నదంతా ఒకటే కదా అనే కృతక వైరాగ్యం తెచ్చిపెట్టుకునో, మనసులో ఉంటే చాలండీ... చేస్తేనే భక్తి ఉన్నట్లా అనో మెట్ట వేదాంతం కబుర్లు చెప్పుకునో, సంధ్యావందనం మానేసాననుకోండీ, ఇక అంతకన్నా భ్రష్టత్వం మరొకటి ఉండదు.

అందువల్ల, మహాత్ముల స్థాయికి వెళ్ళేవరకు,
ప్రతీ ఒక్కరికి, వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టీ, వేదం విహించిన నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, సత్కార్యాలు ఆచరించవలసినదే. రాగి పాత్ర ఉంటే ప్రతీ రోజూ శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లు, మనకి చిత్తశుద్ధి కలిగేవరకు విహితకర్మాచరణ ప్రతీ రోజూ చేస్తూ ఉండవలసినదే".
 

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి