23, మే 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలి


"మనం ఎవరినైనా, వారిలో ఉన్న సద్గుణాలను నిజాయితీగా ప్రశంస చేయడం వల్ల, ఆ వ్యక్తి మరింత ప్రోత్సాహము పొంది, ఆతనిలో ఉన్న ఆ సద్గుణములను మరింత వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాగని ప్రశంస చేయడంలో తగు జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదే పనిగా ప్రశంస చేయడం సరికాదు, ఇది చాలా సున్నితమైన అంశం. ఈశ్వరుడిని, గురువుని మాత్రమే ప్రత్యక్షముగా ప్రశంస చేయాలని విజ్ఞులైన పెద్దలు చెబుతారు. స్నేహితులు, బంధువుల గురించి, వారిని ప్రత్యక్షంగా ప్రశంస చేయడం కన్నా, ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి సద్గుణములను ప్రశంసించడం మంచిది. యజమాని, తన సేవకుడికి అప్పజెప్పిన కార్యం దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాతనే ప్రశంస చేయాలి. ఒక తండ్రి తన కొడుకుని ప్రత్యక్షంగా ఎప్పుడూ ప్రశంస చేయకూడదు".

యజమాని సేవకుడిని ప్రశంస చేసే విషయంలో గొప్ప ఉదాహరణ, శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ దర్శనం చేసి వచ్చిన హనుమని కౌగలించుకుని, హనుమా నువ్వు నా సోదరుడు భరతుడితో సమానం, నీ ఋణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను, నీవు చేసిన సహాయం నాలో జీర్ణమైపోవుగాక అని చెప్తారు కదా. పైన యజమాని సేవకుడిని ఎప్పుడు ప్రశంసించాలి అని చదువుతూ ఉంటే, శ్రీరామ హనుమల ఆలింగనం గుర్తుకు వచ్చింది.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి