13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (నాల్గవ-చివరి భాగము - ఫలసృతి)

శ్రీ గురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (నాల్గవ-చివరి భాగము - ఫలసృతి)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

అమ్మవారి అపారకరుణా కటాక్షమహిమను తెలిపే ఈ ఆరవ శ్లోకము పరమ శక్తివంతమైనది. ఈ శ్లోకమునందు  శ్రీవిద్యాసాంప్రదాయములోని బాలమంత్రములోని కామరాజబీజాన్ని ఇచ్చారు శంకరులు. పరమపవిత్రమైన ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో 10,500 సార్లు పారాయణ చేస్తే సాక్షాత్తు రాజరాజేశ్వరీ అమ్మవారి దర్శనం కలుగుతుంది మరియు సంతానము లేనివారికి సత్సంతానము-సుపుత్రప్రాప్తి కలుగుతుంది అని పెద్దల వ్యాఖ్యానము. మన సనాతన ధర్మములోని గొప్ప గొప్ప విషయాలను, మన వాఙ్మయాన్ని, నేటి కాలంలో మన దేశస్థుల కంటే, విదేశీయులు విశేషమైన పరిశోధన చేశారు. జర్మనీ దేశమునకు చెందిన కొందరు ఔత్సాహికులు 1950 లలో సౌందర్యలహరి లోని ఈ ఆరవ శ్లోకం యొక్క ఫలశృతిని నిర్ధారించుకోడానికి ఒక ప్రయోగం చేశారు. ఒక సంస్కృత పండితుడి చేత ఈ శ్లోకాన్ని పఠింపచేసి, ఆ ఆడియోని ఒక టేప్ రికార్డర్లో అదే పనిగా ప్లే చేయడం ప్రారంభించారు. సరిగ్గా 10500వ సారి శ్లోకం ప్లే అవ్వగానే టేప్ రికార్డర్ పాడడం మానేసింది. ఏమి జరిగిందా అని తీసి చూస్తే, లోపల టేప్ అంతా కాలిపోయి, ఆ కాలిన టేప్ అంతా రాజరాజేశ్వరీ అమ్మవారి రూపం దాల్చి కనబడిందని, అప్పట్లో హిందూ దినపత్రికవారు ఈ వార్తని ప్రచురించారని పెద్దల వ్యాఖ్యానములో పేర్కొన్నారు.

ఇంతటి అమృతభాండమైన శ్లోకాలను సౌందర్యలహరి రూపములో మనకి భిక్షపెట్టిన జగద్గురు ఆదిశంకరాచార్యులకు మనం ఏమి ఇచ్చి ఋణము తీర్చుకోలేము. భక్తితో జగద్గురువుల పాదములకు నమస్కరించి, అమృతభాండమైన ఈ శ్లోకాలను పారాయణ చేసి, అమ్మవారి కరుణాకటాక్షవీక్షణమునకు పాత్రులమవుదాము!!

జయ జయ శంకర హర హర శంకర!!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (మూడవ భాగము)

శ్రీ గురుభ్యో నమః
II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (మూడవ భాగము)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

సౌందర్యలహరి 6వ శ్లోకంలో అమ్మవారి కృపని తెలియజేసే రెండు ముఖ్యమైన రహస్యాలు

ఈ శ్లోకం పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క కృప ఎలా ఉంటుందో తెలియజేసే రెండు అతి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. మొదటి రహస్యం - ఈ శ్లోకంలో అమ్మవారిని ‘హిమగిరిసుతే’ అని ఎందుకు సంబోధించారు శంకరులు. రెండవ రహస్యం – అమ్మవారి క్రీగంటి చూపు (అపాంగ వీక్షణము) వైభవం గురించి ఈ శ్లోకంలో ప్రస్తావించారు.

మొదటి రహస్యం – హిమగిరిసుతే అనే నామం ఎందుకు అన్నారో పరిశీలిద్దాము. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి. అంటే అనంతమైన నామములు కలిగినది. అన్ని నామాలు ఉండగా ‘హిమగిరిసుతే’ అని ఈ శ్లోకంలో ఎందుకు అన్నారు శంకరులు అని పరిశీలిస్తే – హిమవత్పర్వతము ఎప్పుడూ చల్లగా ఉంటుంది. హిమవంతుడి కూతురిగా వచ్చింది కదా. అంటే అమ్మవారి చల్లని చూపులు అంటే – మనలను చల్లగా చూసే తల్లి అని - భక్తులను రక్షించే తత్త్వాన్ని తెలియజేయడం. మరియు ప్రత్యేకంగా ఈ శ్లోకంలోనే ఎందుకు ఈ నామాన్ని వాడారు శంకరులు అని చూస్తే – పరమశివుడికి కామాన్ని కలిగిద్దామని ధూర్తప్రయత్నం చేసి, శివుడి మూడవ కంటి మంటకి మన్మథుడు కాలిపోయాడు కదా. దాని ఫలితముగా మన్మథుడి భార్య రతీదేవి పతివియోగ దుఃఖముతో అమ్మవారిని ప్రార్ధన చేసింది – తనకి పతిభిక్ష పెట్టమని. రతీదేవి ప్రార్ధనని మన్నించిన అమ్మవారు అపార కరుణతో మన్మథుడిని తిరిగి బ్రతికించింది. అయితే జగత్తుకే తండ్రి అయిన పరమశివుడికి కామం కలిగించే ధూర్తచేష్టితము వలన మన్మథుడు పోగొట్టుకున్న శరీరాన్ని మాత్రం అమ్మవారు ఇవ్వలేదు. రతీదేవికి పతిభిక్ష పెట్టి మన్మథుడిని తిరిగి బ్రతికించడంలో అమ్మవారి చల్లని చూపులు/రక్షకత్వము ఉన్నాయి. అందుకే ఈ శ్లోకంలో ఆ చల్లని తల్లి యొక్క రక్షకత్వాన్ని సూచించడానికే అమ్మవారిని ‘హిమగిరిసుతే’ అని సంబోధించారు శంకరులు. ఇంకొక విషయం మన్మథుడికి తిరిగి శరీరం ఇవ్వకపోవడంలో పరమశివుని ఇల్లాలుగా ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడంలో అమ్మవారి పాతివ్రత్యము కనబడుతుంది. (అంటే అయ్యవారు మన్మథుడిని శిక్షించడానికి ఏ శరీరాన్ని కాల్చారో, ఆ శరీరం తిరిగి ఇస్తే, అయ్యవారి యొక్క ఆజ్ఞని ధిక్కరించినట్టు అవ్వదూ… అందుకనే అమ్మవారు మన్మథుడికి శరీరం ఇవ్వకుండా అనంగుడిగా ఉండి కేవలం అతని భార్య రతీదేవికి మాత్రమే కనబడేలా అనుగ్రహించారు.) మా అమ్మ సదాశివపతివ్రతా కదా.
 
ఇంతేనా??  కాదు కాదు ఇంకా ఉంది – ఇంకో కోణంలో అర్ధం చేసుకుంటే పరబ్రహ్మస్వరూపమైన పరమశివుడికి కామం కలిగించడంలో విఫలమై శరీరాన్ని పోగొట్టుకున్న మన్మథుడి వృత్తాంతాన్ని తెలియజేస్తూనే మరొక ప్రక్క కాముడ్ని కాల్చిన పరమశివుడికి కామాన్ని కలిగించడంలో సఫలం అయ్యినది ఎవరు? హిమవంతుడి కూతురిగా వచ్చిన అమ్మవారే కదా!! హిమవంతుడి కూతురిగా వచ్చిన తర్వాతనే కదా అమ్మవారు తపస్సు చేయడం, పరమశివుడితో కళ్యాణం, ఆపైన శంకరుడికి కామాన్ని కలిగించి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగడం – ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? హిమవంతుడి కూతురిగా వచ్చిన అమ్మవారి వైభవం వల్లనే కదా. ఇదంతా సూచించడానికే ‘హిమగిరిసుతే’ అన్నారు శంకరులు.

ఈ విషయాన్నే మూకపంచశతి – కటాక్షశతకములో ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్పారు మూకశంకరేంద్రులు.
          “శ్రీకామకోటి శివలోచన శోషితస్య
          శృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే
          ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే
          కేదారమంబ తవ కేవల దృష్టిపాతమ్” II 19 II

పై శ్లోకంలో మూకశంకరులు అంటున్నారు – “శ్రీకామకోటి పీఠస్వరూపిణి అయిన ఓ కామాక్షీ అమ్మా!! శివలోచన శోషితస్య అంటే పరమశివుని కంటిచేత ఎండిపోయిన (ఆర్పివేయబడిన/నశించిన), శృంగారబీజ విభవస్య – శృంగారబీజములను కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మథుడు అనే బీజాన్ని, పునః ప్రవాహే – తిరిగి బ్రతికించుటలో - ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపాకటాక్షము (దృష్టిపాతము) పొలముగా నేను భావిస్తున్నాను తల్లీ !!
 
అంటే శివుడి కంటి మంటకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొలము ఏది – అది అత్యంత ప్రేమ అనే జలములతో బాగా తడిసిన అమ్మవారి దృష్టిపాతము అనే పొలముగా మూకశంకరులు పేర్కొన్నారు.

రెండవ రహస్యం – అమ్మవారి కడగంటి చూపు యొక్క వైభవం - అమ్మవారి యొక్క చల్లని అపాంగవీక్షణములను గురించి ఈ శ్లోకంలో ‘అపాఙ్గాత్తే’ అని ఇచ్చారు శంకరులు. అపాంగవీక్షణము అంటే కడగంటిచూపు. అమ్మవారి క్రీగంటి చూపు యొక్క ప్రత్యేకత ఏమిటి? పూజ్య గురువు గారు అనేకమార్లు ప్రవచనములో చెప్తూఉంటారు - ఎదురుగా చూసే చూపుకన్నా క్రీగంట చూసే చూపు మరింత ప్రేమను తెలియజేస్తుంది. క్రీగంటి చూపు అని అనడంలో మరొక ఔచిత్యం కూడా ఉన్నది. అమ్మవారు విశాలాక్షి కదా.. విశాలమైన కన్నులు కలది అంటే ఈ జగత్తులో ఉన్న సకల జీవకోటిని కనిపెట్టుకుని రక్షించే విశాలమైన చూపు ఉన్న అమ్మ అని.

 
శ్రీ గుణరత్న కోశంలో పరాశరభట్టరులు ఇచ్చిన ఈ అద్భుతమైన శ్లోకం గురించి పూజ్య గురువు గారు తరచు ఉటంకిస్తారు.
 
యద్భ్రూభఙ్గాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః
 
వేదాన్తాస్తత్వ చిన్తాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరన్తి
 
భోగోపోద్ఘాత కేళీ చులుకిత భగవద్వైశ్వ రూప్యానుభావా
 
సా నః శ్రీరాస్తృణీతామమృత లహరి ధీ లఙ్ఘనీయైరపాఙ్గైః II
 
శ్రీమహావిష్ణువు ఈ సకల సృష్ఠిని చేయడానికి, ఆయన చేస్తున్న పని సరిగా ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ప్రమాణం ఒకటి కావాలి కదా. అది రంగనాయకి అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలికల బట్టి చేస్తారు. అలాగే వేదములకు కూడా ప్రమాణం మురారి హృదయమున ఉన్న అమ్మవారి పాదపద్మముల చిహ్నము. అలాగే శ్రీమన్నారాయణుడు రంగనాయకి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి, అమ్మ యొక్క స్వరూప గుణములను చూస్తూ ఆ భోగానుభవముతోనే ఆనందించి ఈ విశ్వరూపమును దాలుస్తున్నాడుట. అంటే క్లుప్తంగా చెప్తే అమ్మవారిని చూసిన ఆనందానుభవమే ఆయన విశ్వరూపం దాల్చడానికి కారణం అని. అటువంటి అనంత కళ్యాణ గుణములు కలిగిన శ్రీమురారి హృదయేశ్వరీ-రంగనాయకి అమ్మవారి కరుణాపూరిత క్రీగంటి చూపుల యొక్క అమృతలహరి నా మనసు యందు వర్షించుగాక అని అంటున్నారు పరాశరులు. ఇక్కడ ధీ అని అనడంలో అర్ధం- ఆ అమృత లహరిని బాహ్యము నందు గాక ఆంతరమున మనసులో అనుభవించాలి అని అర్ధం.

   
అలాగే మూకపంచశతి-ఆర్యాశతకములో మూకశంకరులు ఇచ్చిన ఈ క్రింది రెండు శ్లోకములు సౌందర్యలహరిలోని ధనుఃపౌష్పం మౌర్వీ అనే శ్లోకార్ధముతో అనుసంధానము చేసుకోవచ్చు…
          “కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్
          పరమాం కలా ముపాసే పరశివ వామాంక పీఠికాసీనామ్” II 11 II
 
కాంచీనగరమునకు రత్నవిభూషణము వంటిది, కందర్పుడు అంటే మన్మథుడికి జన్మగృహమైన కటాక్షము కలది (అంటే పరమశివుని కంటిమంటకి కాలిపోయిన మన్మథుడికి తిరిగి బ్రతికించడానికి కారణమైన అమ్మవారి క్రీగంటి చూపులను కందర్పసూతికాపాంగీమ్ – అమ్మవారి కడగంటి చూపులను మన్మథుడి పుట్టినిల్లుగా సంబోధించారు), పరమశివుని ఎడమతొడపై కూర్చొని ఉన్న ఒకానొక శ్రేష్ఠమైన కళను ఉపాసించెదను అని పై శ్లోకమునకు భావము. ఇక్కడ అమ్మవారిని పరమాం కలాం అని చెప్పడంలో రహస్యం – అమ్మవారిని మహాషోడశిగా చెప్తున్నారు. ఆ షోడశీ యే పరమకళ.

పై శ్లోకంలో అమ్మవారి దృష్టిపాతములను మన్మథుని పుట్టినిల్లుగా చెప్పారు. ఆ తర్వాత శ్లోకం చూద్దాం..
          “కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్
          కేలీవనం మనో మే కేషాం చిద్భవతు చిద్విలాసానామ్” II 12 II
కంపానదీతీరమున చరించు కరుణ మొగ్గతొడిగిన చూపుగల అనిర్వచనీయమైన చిద్విలాసములకు నా మనస్సు విహారోద్యానవనమగుగాక!! అని పై శ్లోకమునకు అర్ధము.

అలాగే అమ్మవారి కటాక్షవీక్షణముల గురించి వర్ణించే మరొక పరమాద్భుతమైన శ్లోకము మూకపంచశతి-కటాక్షశతకములో మూకశంకరులు ఇచ్చారు.
సంజీవనేజనని చూతశిలీముఖస్య
సమ్మోహనే శశికిశోరక శేఖరస్య
సంస్తమ్భనే చ మమతాగ్రహచేష్టితస్య
కామాక్షి! వీక్షణ కలా పరమౌషధం తే II 15 II

ఓ జననీ!! అమ్మా కామాక్షీ!! నీ యొక్క కరుణార్ద్ర వీక్షణములో పదహారవ భాగము – చూతలీముఖస్య అంటే మామిడిపువ్వు బాణముగా గల మన్మథుని యొక్క, సంజీవనే – బ్రతికించుట యందు, సమ్మోహనే శశికిశోరకశేఖరస్య – అంటే చంద్రవంకను తలపై ధరించిన పరమశివుని మోహింపజేయుట యందు, మమకారము+ఆగ్రహములనెడి (రాగద్వేషములు) దుర్గుణములను స్తంభింపజేయుట యందు గొప్ప ఔషధం అమ్మా నీ కటాక్షవీక్షణము!! అని అంటున్నారు మూకశంకరులు – అమ్మవారి కటాక్షం గొప్ప ఔషధం. ఇదే అర్ధం లలితాసహస్రంలో ‘హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః’ అనే నామంలో మనం చూడవచ్చు. సృష్ఠిలో ఒకే ఔషధము – సంజీవని గానూ, సమ్మోహనం కలిగించేదిగానూ, సంస్తభనం కలిగించేది గానూ ఎక్కడా ఉండదు. అది ఒక్క అమ్మవారి కటాక్షము మాత్రమే. ఒకేసారి అమ్మ కటాక్షం మన్మథుడికి సంజీవని, కామమెరుగని శివుడికి సమ్మోహని, మన యొక్క రాగద్వేషములకు సంస్తంభని. ఇదే భావం సుందరకాండలో సీతమ్మతల్లి గురించి వాల్మీకి మహర్షి చెప్తారు. అక్కడ ఉన్న ఒకే అమ్మవారు శింశుపా వృక్షముపై కూర్చున్న స్వామిహనుమకి జగన్మాతలా, శ్రీరాముడికి అభేదమైన పరబ్రహ్మస్వరూపిణిగా దర్శనం ఇస్తోంది, అదే స్వరూపంతో దుష్టరావణుడికి అనుభవించాల్సినదిగా కనబడుతోంది, అదే అమ్మవారు ప్రక్కనే ఉన్న రాక్షస స్త్రీలకు భోజనానికి పనికి వచ్చే ఆహారంగా కనబడుతోంది. మహామాయాస్వరూపిణి కదా అమ్మవారు!! అమ్మవారి కటాక్షమనెడి ఔషధము మనందరి మీదా సదా ప్రసరించాలని కామాక్షీ అమ్మవారిని ప్రార్ధిద్దాము.

(సశేషం...)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (రెండవ భాగము)

శ్రీ గురుభ్యో నమః
II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (రెండవ భాగము)



ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

సౌందర్యలహరి ఆరవ శ్లోకంలో మనం తెలుసుకోవలసిన తత్త్వ రహస్యములు

మన్మథుడి ధనుస్సు పుష్పములతో చేయబడినది అంటే – మన మనస్సే ధనుస్సు. లలితాసహస్రనామస్తోత్రంలో ‘మనోరూపేక్షుకోదండా’ అని అమ్మవారికి నామము. అమ్మవారు ఇక్షుకోదండం – అంటే చెరుకువిల్లు అనే కోదండం పట్టుకుంటారు. అదే ఇక్కడ మన్మథుడి చేతిలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సాధనాపరమైన గొప్ప రహస్యం ఏమిటంటే – మన మనస్సులే మన్మథుడికి ధనుస్సు ఆయుధం. అంటే మన మనస్సులలో కామభావనలు ఉద్దీపనం చేసి మథిస్తాడు కనుకనే ఆయనకి మన్మథుడు అని పేరు వచ్చింది. మరి అమ్మవారు కూడా ఆ మనస్సు అనే ఇక్షుకోదండం పట్టుకోవడం దేనికి అంటే – అమ్మవారి అనుగ్రహం లభించనంతవరకూ మనస్సు మన్మథుడి ఆయుధమై ఉంటుంది. అలా మన మనస్సు మన్మథుడి ఆయుధమై ఉన్నంత వరకు మన మనస్సులో ఎప్పుడూ కోరికలు, కోరిక తీరడం వల్ల వచ్చే అనుభవములు ఇలా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదే అమ్మవారి అనుగ్రహం లభిస్తే, ఇంతక్రితం ఏ మనస్సు వలన పతనం అవుతున్నామో, అదే మనస్సుని మనల్ని ఉద్ధరించే దిశగా భగవంతుడివైపుకి త్రిప్పగలదు అమ్మవారు. అది సూచించడానికే అమ్మవారు మనస్సనే రూపమును కలిగిన చెరుకువిల్లుని పట్టుకుంటుంది. ఇక అమ్మ కటాక్షం లభించిందా అప్పటినుంచీ మనస్సులో వచ్చే కోరికలు అన్నీ ధర్మబద్ధమైనవి, సాత్వికమైనవి అయి ఉండి మనల్ని ఉద్ధరించేవిగా, భగవంతుడి పరంగా ఉంటాయి.

అదే విధంగా తుమ్మెదలవరుసతో కూడిన వింటినారి అని చెప్పడంలో రహస్యం – ఇంద్రియ సుఖములను మన మనస్సుకు అనుభవింపచేసే నాడీ మండలాన్ని (పంచతన్మాత్రలు) సూచిస్తుంది ఈ తుమ్మెదల వరుస. దీనినే లలితాసహస్రనామస్తోత్రంలో ‘పంచతన్మాత్రసాయకా’ అనే నామంతో అనుసంధానం చేసుకోవచ్చు. మన్మథుడి చేతిలో ఉండే ఐదు బాణములు వరుసగా ఉన్మాదము, తాపనము, స్తంభనము, శోషణము మరియు సమ్మోహనము. అలాగే మన్మథుడి చేతిలో ఉండేవి ఐదు పుష్పములు. అవి వరుసగా అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక మరియు నీలోత్పలము. ఈ ఐదు బాణములే ఐదు జ్ఞానేంద్రియములకు సంకేతము. ఇదే ఐదు పుష్పాలను అమ్మవారు కూడా పట్టుకుంటారు. అమ్మవారి నాలుగు బాహువులలో పట్టుకునే వాటిని లలితాసహస్రంలోని మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్రసాయకా అనే నామములను పరిశీలిస్తే – ఇవే చెరుకువిల్లు, ఐదుపుష్పాలు మన్మథుడు పట్టుకుంటే మనం ఎలా లౌల్యంతో తిరుగుతామో, అదే అమ్మవారు పట్టుకుంటే ఎలా ఉద్ధరింపబడతామో ఆ రహస్యం తెలుస్తుంది.

అమ్మవారి అనుగ్రహం లభినంచనంతవరకు మన్మథ బాణాలు పడుతూనే ఉంటాయి. కోరిక తర్వాత కోరిక పుడుతూనే ఉంటుంది, ఒక ఇంద్రియముతో సుఖము అనుభవించడం, అది అయ్యాక మరొక ఇంద్రియముతో…. ఇలా మార్చి మార్చి .. మార్చి మార్చి మనచేత ఇంద్రియ సుఖములను అనుభవింపజేయడమే మన్మథుని విజయము. 

గరుడ పురాణములో ఒక శ్లోకము కలదు –
          “కురంగ మాతంగ పతంగ భృంగ మీనాః హతాః పంచభిరేవపంచ
          ఏకః ప్రమాథీ సకథం వహన్యతే యస్సేవతే పంచభిరేవపంచ

పై శ్లోకానికి అర్ధం – “లేడికి శ్రోత్రేంద్రియ లౌల్యము, ఏనుగుకి స్పర్శేంద్రియ లౌల్యము, మిడతకి రూపేంద్రియ లౌల్యము, తుమ్మెదకి రసనేంద్రియ లౌల్యము, చేప ఘ్రాణేంద్రియ లౌల్యము – ఇలా ఒక్కో జాతి ఒక్కో ఇంద్రియ లౌల్యముతో పతనం అయిపోతుంది. కానీ మనిషికి ఐదు ఇంద్రియముల వలన పతనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిగతా జీవుల కన్నా మనం ఐదురెట్లు జాగ్రత్తగా ఉండవలెను” అని.

ఇప్పటి వరకూ మన్మథుడి బాణాలు పడుతున్నంతసేపూ కేవలం సుఖం కోసం, ఇంద్రియ లౌల్యముతో తిరుగుతూ ఉంటాడు. అదే అమ్మవారి చేతిలో ఉన్న పుష్పబాణము వంక చూసి, అమ్మకి నమస్కరిస్తే – ఇంద్రియ సుఖములను కూడా భగవంతుడి పరం చేయడం అలవాటౌతుంది. ఉదాహరణకి ఇతఃపూర్వం రసేంద్రియమునకు లోబడి అదే పనిగా తినేవాడు ఇప్పుడు అమ్మ అనుగ్రహం కలిగాక, అదే పదార్ధాన్ని అమ్మవారికి అయ్యవారికి నివేదన చేసి, అమ్మ ప్రసాదం తింటున్నాను అని కళ్లకద్దుకుని తింటాడు. అలాగే అమ్మ అనుగ్రహం కలిగాక స్పర్శ అనే ఇంద్రియముతో ఎప్పుడెప్పుడు తాను నమ్మిన గురువు గారి యొక్క పాదములకు తన తల తాకించి నమస్కరిద్దామా అని చూస్తాడు. ఎప్పుడెప్పుడు గురువు గారి ఆశీర్వచనం చేసే ఆయన చేయి తన శిరస్సుకి తాకుతుందా అని కోరుకుంటాడు. అమ్మవారి చేతిలో ఉండే పుష్పములను చూస్తే ప్రతీ ఇంద్రియాన్ని జీవితంలో ఎదగడానికి, ఆధ్యాత్మికముగా ఉద్ధరణహేతువై ఉపయోగించుకుంటూ లౌల్యమునకు గురికాకుండా బ్రతకడం అలవాటవుతుంది.

అలాగే ఈ శ్లోకంలో వసంతుడిని సామంతుడిగా చెప్పడానికి కారణం – వసంత ఋతువు చెట్లను చిగురింపచేసి, పుష్పింపచేసి ప్రకృతి శోభను పెంచడం ద్వారానూ మనుష్యులకు, ఇతర జీవరాశికి ఆశలను చిగురింపజేయడంలో మన్మథుడికి సహకరిస్తాడు. అలాగే మలయ పర్వతము మీద నుంచి వచ్చే గాలి మనస్సులకు ఆహ్లాదము/పులకరింత కలిగించి మన్మథుడికి మరింత సహాయ పడుతుంది. కానీ ఇక్కడ వసంత ఋతువు ఎప్పుడూ ఉండదు. మలయ పర్వతము అనేది ఎక్కడో ఒక్కచోట ఉండడం వల్ల ఆ మలయమారుతము అన్ని చోట్ల ఒకేలా వీస్తుంది అని చెప్పడం కష్టం. ఇలా అన్నీ బలహీనమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండీ, శరీరము కూడా లేకపోయినా – మన్మథుడు జగత్తులో సకల జీవులనూ జయించగలుగుతున్నాడు అంటే కారణము – హిమగిరిసుత అయిన కామాక్షీ అమ్మవారి అపాంగ వీక్షణం మన్మథుడిపై పడడం వలన మాత్రమే. 

ఈ శ్లోకములో శంకరాచార్యులవారు మన్మథుడి విజయానికి కారణమైన రహస్యాన్ని చెప్తున్నారు.. అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఉండబట్టే మన్మథుడు ఈ లోకాలన్నిటినీ జయించగలుగుతున్నాడు. మన్మథుడి విజయాలకు కారణమైన అమ్మవారి కటాక్ష మహిమ తెలుసుకొని, భక్తితో అమ్మవారికి నమస్కరించి ఈ శ్లోకం పారాయణ చేయడం వలన, మన్మథుడి బాణములు మనమీద పడవు. అమ్మవారి కటాక్షం లభించడం వలన జీవితంలో అనుభవించే ప్రతీదీ ఈశ్వర ప్రసాదముగా, ధర్మబద్ధమైన సుఖములను (ధర్మబద్ధమైన అర్ధము+కామము) మాత్రమే అనుభవిస్తూ, ఇంద్రియ సుఖముల యందు లౌల్యము లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు.


(సశేషం...)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (మొదటి భాగము)

శ్రీ గురుభ్యో నమః

I
I కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (మొదటి భాగము)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

 తాత్పర్యముః అమ్మా!! హిమగిరిసుతే! పర్వతరాజపుత్రికా, హిమవంతుని కూతురా, హైమవతీ !! అత్యంత కరుణాపూరితమైన నీ యొక్క కడగంటి చూపుల వలన, నీ కృప చేత, అసలు శరీరమే లేని మన్మథుడు పుష్పములచే చేయబడిన ధనుస్సు తుమ్మెదల వరుసలతో నిర్మించిన వింటినారి, కేవలం ఐదే బాణములు కలిగినవాడై, సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉండే వసంతుడు (వసంత ఋతువు) ఆయన సచివుడిగానూ, దక్షిణ దిక్కుగా వీచే మలయమారుతము మన్మథుని రథముగానూ.. యుద్ధం చేయడానికి ఏ మాత్రమూ సామర్ధ్యము లేని ఈ ఆయుధ సామాగ్రితో, అసలు శరీరమే లేనివాడు (అనంగుడు అనగా అంగములు లేనివాడు) అయిననూ, కేవలం నీ కటాక్షవీక్షణము లభించడం వలన మాత్రమే ఈ జగత్తంతటినీ జయిస్తున్నాడు తల్లీ!!

భావార్ధముః అమ్మవారిని ఆరాధించిన ఫలితముగా మౌనముగా తపస్సు చేసుకొనే మునులను సైతం మన్మథుడు ఎలా మోహపెట్టగలుగుతున్నాడో క్రిందటి శ్లోకంలో వివరించారు శంకరులు. దానికి కొనసాగింపుగా ఈ శ్లోకములో మన్మథుడు ఎలా ఈ లోకాలను జయిస్తున్నదీ, యుద్ధము చేయడానికి ఏమాత్రమూ పనికిరాని అత్యంత బలహీనమైన ఆయుధ సామాగ్రిని కలిగి, శరీరం కూడా లేకుండా ఉన్నాకూడా కేవలం కామాక్షీ అమ్మవారి కటాక్షవీక్షణమును పొందిన కారణంగా మాత్రమే స్మరుడు లోకాలన్నిటినీ జయిస్తున్నాడు అనే రహస్యాన్ని శంకరులు ఈ శ్లోకంలో మనకి బోధ చేశారు.

ఈ శ్లోకం యొక్క భావార్ధము పరిశీలిస్తే, ధనుః పౌష్పం అంటే పుష్పములతో చేయబడిన ధనుస్సు. అసలు లోకంలో ఎవరైనా యుద్ధం చేయాలంటే ఎంత గొప్ప ధనుస్సు అయి ఉండాలి, దాని వింటినారి ఎంత బలమైనది అయి ఉండాలి. శ్రీరామాయణంలో రామచంద్ర మూర్తి ధనుస్సు పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆయన చేసే ధనుష్ఠంకారము (అంటే వింటినారిని లాగి వదలడం) చేస్తే కొన్ని వేల మంది రాక్షసులు ఆ శబ్దానికే ప్రాణాలు విడిచిపెడతారుట. అంటే శ్రీరాముడి చేతిలో ధనుస్సు ఎంత శక్తివంతమో తెలుస్తుంది. అంత బలమైన ధనుస్సును వహించాలంటే రామచంద్రమూర్తి శౌర్యము ఎంతటిదో అర్ధం అవుతుంది. అదేవిధంగా అర్జునుడికి వరప్రసాదంగా లభించిన ధనుస్సు ‘గాండీవం’ కూడా అత్యంత శక్తివంతమైనది. అసలు ఆ ధనుస్సులను సామాన్య మానవులు ఎవరూ, కనీసం ఎత్తనైనా ఎత్తలేరు. యుద్ధం చేయాలంటే అంత గొప్ప శక్తివంతమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మన్మథుడికి ఉన్న ఆయుధం ఏమిటి – పుష్పములతో చేయబడిన ధనుస్సు. ఒక రోజు కన్నా ఎక్కువ ఆయుష్షు లేని, పరమ సౌకుమార్యము కలిగినవి అయిన పుష్పములు. అంటే ఆ ధనుస్సే ఎంత బలహీనమైనదో త్తెలుస్తూనే ఉంది. పోనీ ఆ ధనుస్సుకి కట్టిన అల్లెత్రాడు (వింటినారి)ని చూస్తే, అది ‘మౌర్వీ మధుకరమయీ’ అన్నారు. మత్తుగా తేనెను త్రాగిన తుమ్మెదలవరుస మన్మథుడి ధనుస్సుకి కట్టిన అల్లెత్రాడుట. అత్యంత చపలత్వము కలిగిన తుమ్మెదలు అన్నీ ఒక వరుసలో కూడడమే కష్టము. ఇక ఆ అల్లెత్రాడుకు తన్యత (tension) ఎలా ఉంటుంది? ఇంక అటువంటి ధనుస్సుని ఎక్కుపెట్టడం ఎలా? సాధ్యమయ్యే పనేనా?
సరే ఆయనకున్న బాణాలని చూస్తే “పంచవిశిఖాః” అన్నారు శంకరులు. ఉన్నవి ఐదే ఐదు బాణాలట. ఈ జగత్తులో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటినట్టినీ కాముడు జయించాలి అంటే, ఎన్ని బాణాలు కావాలి. అలాంటిది కేవలం ఐదే బాణాలు ఉన్నాయి మన్మథుడి దగ్గర.

ఇక ఆయన దగ్గర ఉన్న ఇతర బలగాన్ని చూస్తే, ‘వసన్తః సామన్తో’ అన్నారు. అంటే సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉండే వసంతుడు (వసంత ఋతువు అని అర్ధం) ఆయన యొక్క సచివుడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం చేయాలన్నా వసంతుడు అన్ని సమయాల్లో ఉండడు. ఇక మన్మథుడి రథం ఏమిటని చూస్తే – ‘మలయ మరుదాయోధన రథః’ – అంటే దక్షిణ దిక్కునుంచి వచ్చే మలయమారుతము అనే గాలి. అసలు ఆ మలయ మారుతము ఎప్పుడు ఏ వైపు వీస్తుందో తెలియదు. అటువంటి రథాన్ని అధిరోహించి మన్మథుడు యుద్ధానికి ఎలా వెళ్తాడు? ఆయన ఒక దిక్కుకి వెళ్లాలనుకుంటే రథం మరో వైపుకు వెళ్లవచ్చు.

మన్మథుడికి ఉన్న ఆయుధములను ఒకసారి సంగ్రహంగా చెబితే
 - పుష్పములతో చేసిన ధనుస్సు,
- తుమ్మెదల వరుసతో ఉన్న వింటినారి
- ఐదే ఐదు బాణములు
- వసంత ఋతువే సచివుడు
- మలయమారుతమే రథము
- మన్మథుడికో అసలు శరీరమే లేదు.

ఇలా ఏ కోణంలో చూసిన ఎటువంటి బలమూ, పెద్ద బలగమూ లేకుండా ఒక్కడే అయి ఉండి మన్మథుడు ఈ లోకాలన్నిటినీ జయించగలుగుతున్నాడు అంటే కారణం – ‘హిమగిరిసుతే కామపి కృపామపాఙ్గాత్తే లబ్ధ్వా’ అన్నారు శంకరులు. హిమగిరిసుత – హిమవంతుడి పుత్రిక అయిన హైమవతి, పార్వతి అమ్మవారి అనిర్వచనీయమైన కృప వలన అమ్మవారి యొక్క అపాంగ వీక్షణము (అంటే క్రీగంటి చూపు) మన్మథుడికి లభించినది. కాబట్టి లౌకికముగా ఎటువంటి ఆయుధ సంపత్తి లేకపోయినా ‘జగదిద మనంగో విజయతే’ అంటే అసలు అంగములే లేని మన్మథుడు ఈ జగత్తునంతటినీ జయిస్తున్నాడు అని శంకరుల భావము. అంటే ఈ లోకములో ఎవరైనా, బాహ్యంలో ఎటువంటి బలమైన కారణములు లేకపోయినా, అమ్మవారి కటాక్షం కలిగితే ఎంతటి దుస్సాధ్యమైన కార్యములనైనా సాధించగలుగుతారు.


(సశేషం...)


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.