15, సెప్టెంబర్ 2011, గురువారం

ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుప్పరంకుండ్రం


వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు 

ఆరు పడై వీడు – తిరుప్పరంకుండ్రం

 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం. 
తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి

ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్థంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్థంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. అది ఎందుకో మాకు కొంత భాష రాకపోవడం వల్ల తెలుసుకోలేక పోయాము. మరొక స్థంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది. పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి. తప్పక చూడవలసిన క్షేత్రం.

ఇక్కడ ఎప్పుడూ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు, ఉత్సవ మూర్తుల స్వామి వారి అభిషేకం చూసే భాగ్యం కూడా దక్కింది.

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది.
మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. వీరి యొక్క పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. (మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములు గురువుల ద్వారా తెలుసుకోవాలి.)
అయితే ఒక రోజు వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లి తో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను” అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి “ నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది“ అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చే వరకు. అమృత వల్లి ని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో “యానై” అంటే ఏనుగు).
అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లీ కళ్యాణ ఘట్టం. వేరే అఖ్యానంలో వివరిస్తాను.

ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు (దీని వెనుక వృత్తాంతం నాకు ఇంకా తెలియదు, తెలిస్తే తప్పక ఇక్కడ తెలియజేస్తాను). వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది.

తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, స్వస్వరూపం వచ్చి, వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయాని ని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ గారికి, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మ గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు.
సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు.
రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని మధురై సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్ ద్వారా: చెన్నై  - 450 Km, బెంగళూరు – 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి మధురై కి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నై లో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది.

వసతి సదుపాయము:
ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇందులోనే ఉన్నాము. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. TTDC వాళ్ళ వెబ్ సైట్ లంకె క్రింద ఇస్తున్నాను.


ఆలయంలో ఆర్జిత సేవలు:
ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది, మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.

క్షేత్రము యొక్క చిరునామా:

స్వామి గురించి వ్రాసిన ఈ టపాలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.


సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి