31, జనవరి 2015, శనివారం

కామాక్షీ సౌందర్యలహరి – 5వ శ్లోకము – అమ్మవారి అనుగ్రహం పొందిన ఇద్దరు దేవీఉపాసకులు

శ్రీగురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 5వ శ్లోకము – అమ్మవారి అనుగ్రహం పొందిన ఇద్దరు దేవీఉపాసకులు II

హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం
పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్ I
స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ II 5 II

 తాత్పర్యముః అమ్మా! నమస్కరించిన జనులకు సౌభాగ్యములను, మంగళములను ప్రసాదించే ఓ జగజ్జననీ! హరి (విష్ణువు) నిన్ను ఆరాధించిన ఫలితముగా, పూర్వమొకనాడు స్త్రీరూపమును ధరించినవాడై, త్రిపురాసురసంహారం చేసిన పరమశివుడికి సైతం మోహాన్ని కలిగించి, ఆయన యొక్క మనస్సును క్షోభ (కలవరపరచడం) పెట్టగలిగాడు. అలాగే మన్మథుడు కూడా నీకు నమస్కరించి, నిన్ను ఆరాధించిన ఫలితముగా, నీ అనుగ్రహం పొందిన కారణంగా, రతీదేవి యొక్క కన్నులకు ఆనందాన్ని కలిగించే స్వరూపము గలవాడై, మౌనముగా తపస్సు చేసుకునే మునీశ్వరుల యొక్క మనసులలో కూడా మోహాన్ని, కామవికారాన్ని కలుగజేయుటలో సమర్ధుడగుచున్నాడు తల్లీ !!

భావార్ధముః ఈ ఒక్క శ్లోకములోనే, ఆదిశంకరాచార్యులవారు ఎన్నో పురాణ ఆఖ్యానములను, అమ్మవారి ఆరాధనా రహస్యాలను అందించారు.

అమ్మవారి గొప్ప దేవీఉపాసకులలో ఇద్దరైన శ్రీమహావిష్ణువు మరియు మన్మథుడి గురించి, శంకరాచార్యుల వారు ఈ శ్లోకములో ప్రస్తుతించారు. ఆ పన్నెండు మంది దేవీఉపాసకులు వరుసగా, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడు, ఇంద్రుడు, కుబేరుడు, మన్మథుడు, సూర్యుడు, చంద్రుడు, లోపాముద్ర, అగస్త్య మహర్షి మరియు దూర్వాసో మహర్షి.  వీరిలో విష్ణువు, మన్మథులు అమ్మవారి ఉపాసన వలన ఎంత గొప్ప అసాధ్యములైన కార్యములు చేయగలిగారో వివరించారు. అదే విధముగా శ్రీవిద్యోపాసనలో కూడా విష్ణువు ఒక ప్రస్తారానికి ఋషి/మంత్రద్రష్ఠ అనీ మరియు మన్మథుడు ఇచ్చిన విద్యనే కాదివిద్య అనీ పెద్దలు చెప్తారు.

ఈ శ్లోకం యొక్క భావార్ధము గమనిస్తే, ముందుగా అమ్మవారిని “ప్రణతజన సౌభాగ్య జననీం” అని సంబోధించారు శంకరులు. అనగా నమస్కరించిన జనులకు సౌభాగ్యములను (శుభగత్వము), మంగళములను, శుభములను చేకూర్చే జననీ/తల్లీ అని భావము. నమస్కరించడం అంటే మనసా, వాచా కర్మణా మూడు విధాలలో అమ్మకి ఎలా నమస్కరించినా, అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు సకల శుభములను వర్షిస్తుంది. దీనినే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి గురించి, త్రిజటా స్వప్నవృత్తాంతము నందు వాల్మీకి మహర్షి అంటారు
“ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా
అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్” – సుందరకాండ 27వ సర్గ 46వ శ్లోకం.

జనకమహారాజు గారి కూతురు, మైథిలిగా పిలువబడే మా సీతమ్మ తల్లికి ప్రణిపాతం చేసి అనగా నమస్కరించిన మాత్రాన ప్రసన్నురాలై, ఎటువంటి ఆపదలు/భయాల నుంచి మనలను రక్షించగల దయాస్వరూపం అని త్రిజట అనే రాక్షసి చెప్పింది. సీతమ్మ తల్లి సాక్షాత్ లలితాపరాభట్టారికాస్వరూపం కదా. సౌందర్యలహరిలోని ‘ప్రణతజన సౌభాగ్య జననీం’, సుందరకాండలోని ‘ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా’ ఒకే అర్ధాన్ని, అమ్మవారి కారుణ్యాన్ని సూచిస్తాయి. ‘అమ్మా !! మేమంతా నీ బిడ్డలమమ్మా’ అని అమ్మకి ప్రణిపాతం చేసినంత మాత్రాన, సకల శుభములను అమ్మ ఇస్తుంది. అమ్మ ఆరాధన చేసినవారికి, శుభములతో పాటుగా, అమ్మ ఇచ్చే మరొక గొప్ప వరం భయాన్ని మరియు ఆపదలను తొలగించడం. ఇక్కడ నమస్కరించడం అంటే శరణాగతి చేయడం.  

తరువాత ఈ శ్లోకంలో మొదటి రెండు పాదములలో శంకరులు అంటున్నారు – ‘హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం – పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్’ అని. హరి అనగా విష్ణువు - అమ్మ వారిని ఆరాధించిన ఫలితంగా, అమ్మ అనుగ్రహం పొందాడు అని ఒక అర్ధం. ఈ మొదటి పాదంలో హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్య జననీం అనే పదములలో, శాక్తేయమునకు చెందిన ప్రణవం కూడా ఉన్నది అని పెద్దల వ్యాఖ్యానము. అలాగే శ్రీసూక్తము నందలి ‘తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే’ అనే మంత్రములో ఉన్న బీజాక్షరమే ఈ శ్లోకములో ‘ప్రణతజన సౌభాగ్యజననీం’ లో ఉన్నదని పెద్దల వ్యాఖ్యానము. లలితా త్రిపురసుందరీ ప్రస్తారభేదములలో ఒక ప్రస్తారానికి ఋషి విష్ణువు. అలాగే అమ్మవారి ఉపాసనలో వైష్ణవీ మంత్రానికి విష్ణువు ఋషి.

మొదటి పాదానికే మరొక అర్ధం కూడా కలదు. హరి అమ్మవారిని ఆరాధించి అమ్మవారిగా మారిపోయిన సౌభాగ్యమును పొందెను అని మరొక అర్ధం. అంటే, మనం ఎవరిని ఉపాసన చేస్తే వారిగా మారిపోతాం అని పెద్దలు/గురువులు చెప్తారు. దీనికి ఒక ఉదాహరణ పరమ పూజ్యులు, సాక్షాత్తు బాలాత్రిపురసుందరీ స్వరూపులు అయిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పడక కుర్చీలో కూర్చొని ఉండగా, వారి ఇంటికి వచ్చిన వారికి శాస్త్రిగారిగా కాక, ఒక పెద్ద ముత్తైదువగా కనబడే వారని, ఒకనాడు ఒకతల్లి వెళ్ళి శాస్త్రిగారు ఉన్నారా అమ్మా! అని ఆ పడక కుర్చీలో కూర్చున్న అమ్మవారిస్వరూపంలో ఉన్న శాస్త్రి గారిని అడిగితే, ఆయన లేచి, “ఏమి.. నేను శాస్త్రినే కనబడట్లేదా!!” అని అడిగేవారుట. అంటే అమ్మవారి ఉపాసన చేయడం వలన ఆయనయే అమ్మగా మారిపోయే సౌభాగ్యం పొందారు. అందుకే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు శరీరం విడిచిపెట్టినప్పుడు, ఆయన శరీరం అగ్నిలో వ్రేలుస్తూ ఉండగా సాక్షాత్తు బాలాత్రిపురసుందరీ అమ్మవారు బయటకి వెళ్ళిపోవడం అక్కడ ప్రత్యక్షంగా చూసినవారు ఉన్నారు, అప్పట్లో వార్తాపత్రికలలో కూడా వేశారు. అదేవిధంగా, శ్రీమహావిష్ణువు కూడా అమ్మవారి ఉపాసన చేసి, అమ్మవారిగా అయిపోయాడు అని దీనికి అన్వయం చేసుకోవాలి. మామూలుగా త్రిమూర్తులకు మధ్య సంబంధం చెబితే, నారాయణ-నారాయణి ఇద్దరూ అన్నాచెల్లెళ్ళుగా చెప్తారు. అంటే, పరబ్రహ్మములోని సృష్ఠి స్థితి లయములు చేసే శక్తి స్వరూపాన్ని స్త్రీ రూపంగా కొలిస్తే అది అమ్మవారు, పురుషరూపంగా కొలిస్తే అది నారాయణుడు/విష్ణువు.

పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్ – అంటే పూర్వం ఒకనాడు హరి స్త్రీ రూపం ధరించాడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పుడితే, అది రాక్షసులకి దక్కకుండా ఉండడం కోసం స్వామి మోహినీ అవతారంలో వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే కదా. ఒకనాడు కైలాసంలో శంకరుడు అడిగాడు.. ఒకసారి ఆ మోహినీ రూపాన్ని చూపమని. అంతట విష్ణువు వద్దులే బావా అని చెప్పినా, శంకరుడు ఒకసారి చూపమని పట్టుబడితే, అప్పుడు విష్ణువు ఒక నవయవ్వన సౌందర్యవతిగా పరమశివుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతట, విష్ణువు మోహినీ రూపముతో సాక్షాత్తు త్రిపురాసురసంహారము చేసిన పరమశివుడికి కూడా చిత్తక్షోభము కలిగించుటలో సమర్ధుడయ్యాడు. అప్పుడే హరిహరసుత అయిన ధర్మశాస్త-అయ్యప్పస్వామి వారి అవతారం వచ్చింది. త్రిపురాసురసంహారము చేసిన పరమశివుడు అనగా జితేంద్రియుడు/త్రిగుణాతీతుడు అని భావము. అటువంటి పరమశివుడికే చిత్తక్షోభమును కలుగజేయగలిగాడు హరి. విష్ణువు స్త్రీరూపంలో వచ్చి పరమశివునికి మోహం కలిగించగలిగాడు అంటే దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే హరి ఆరాధించేది అమ్మవారినే కాబట్టి, ఆయన సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే పొందాడు. త్రిగుణములకు అతీతుడైనవాడైన అయ్యవారిని కూడా మోహపెట్టడం అంటే అది ఒక్క మాయమ్మ కామాక్షీతల్లికి మాత్రమే సాధ్యం. అయ్యవారిచేత సృష్ఠి చేయించడమైనా, స్థితి చేయించడమైనా, లయము చేయించినా అన్నీ మా అమ్మ కామాక్షీ పరదేవత వల్లనే కదా సాధ్యం. అందుకే మూకపంచశతిలో అమ్మవారిని –
·        ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయనపీయూషం – మామిడి చెట్టు మూలము నివాసముగాగల ఆదిమపురుషుడైన పరమశివుని యొక్క నేత్రములకు అమృతము అనీ,
·        పురవైరివిమర్ధ పులకితాంగలతామ్ – పురవైరి అంటే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుని కౌగిలింతచేత పులకించిన తీగవంటి శరీరము కలది అనీ,
·        శంభు సుకృతసంభారైః - అనగా పరమశివుని పుణ్యాల పంట అమ్మవారు అనీ,
·        ఊష్మలఫాలేన లాలితం పుంసాం - అనగా అగ్నినేత్రం కలిగిన శివుని చేత ఎప్పుడూ లాలింపబడే దానా అనీ,
·        పినాకిమూలధనం – పినాకి అనగా పరమశివుని యొక్క మూలధనం అమ్మవారు అనీ,
·        శంకరనయనామృతాయ – అనగా శంకరుడి నయనములకు అమృతము అమ్మవారు అనీ..
ఇలా ఎన్నో కోణాలలో అమ్మవారి యొక్క వైభవాన్ని, అయ్యవారితో అనుసంధానం చేస్తూ అత్యద్భుతంగా చెప్పారు మూకశంకరులు. కాబట్టి త్రిపురములను జయించిన మరియు కాముడ్నే కాల్చిన అయ్యవారు అమ్మవారి దగ్గరకి వచ్చేసరికి మాత్రం – ఆయన కళ్లు పక్కకి త్రిప్పలేడు. ఎందుకంటే అమ్మవారి సౌందర్యం అటువంటిది. మనందరికీ అమ్మ యొక్క అమ్మతనమే సౌందర్యము, కానీ ఈ లోకంలో ఒక్క అయ్యవారికి మాత్రం అమ్మ యొక్క సౌందర్యం – అంతటి పరమశివుడికి కూడా మోహాన్ని కలిగించే సౌందర్యం. అటువంటి సౌందర్యరాశి అయిన అమ్మవారితో కూడిన అయ్యవారు మనందరికీ సర్వత్రా శుభములను చేకూర్చే శంకరుడైనాడు. అదే అమ్మ ప్రక్కన లేకపోతే స్వామి వీరభద్రుడౌతాడు. అటువంటి ఉగ్రస్వరూపం శ్రీరాముడిలో కూడా సీతావియోగం చెందినప్పుడు మనం చూస్తాము. అందుకే పెద్దలు ఎప్పుడూ ‘శక్తితో కూడిన పరబ్రహ్మాన్ని మాత్రమే’ ఉపాసన చెయ్యమని చెప్తారు.

పరమశివుడంతటి వాడికి చిత్తక్షోభం కలిగించడం అంటే, అది ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యమయ్యే విషయంకాదు. విష్ణువు మోహినీ రూపములో మోహం కలిగించగలిగాడు అంటే, నారాయణి అయిన అమ్మ యొక్క తేజస్సు లేకుండా అది సాధ్యం కాదు. విష్ణువు అమ్మవారిని ఆరాధించిన కారణముగా అమ్మరూపమును/అమ్మతేజస్సును పొందగలిగాడు. 

శ్రీమహావిష్ణువు పరమశివునితో ఎన్ని విధాలుగా అనుసంధానం అయి ఉంటాడో శివానందలహరిలో శంకరులు ఈ క్రింది శ్లోకములో అద్భుతముగా ఇచ్చారు.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దద్యౌ I
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః II 82 II

పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే – ఓ ఆర్యాపతీ ! పార్వతీపతీ ! పరమశివా!! శ్రీమహావిష్ణువు బాణంగానూ మరియు వృషభరూపములోనూ (త్రిపురాసుర సంహారములో), భార్యగా నీశరీరములో అర్ధభాగమును పొంది, వరాహ రూపమును (పరమశివుని పాదములను వెతుకుతూ – అరుణాచల వైభవం), స్నేహభావమును, మృదంగము వాయిస్తూ (నటరాజ తాండవం చేసేటప్పుడు) మొదలైనవేగాక, నీ పాదముల యందు ఆయన నయనమును కూడా ఒక పుష్పముగా అర్పించి (నేత్రార్పణేశ్వర లింగము), నీ దేహములో భాగమైన హరి – లోకంలో బ్రహ్మాది పూజనీయులకన్నా మిక్కిలి పూజనీయుడైనాడు. అలాకాకపోతే ఆయన (విష్ణువు) కన్నా గొప్పవాడు అధికుడు ఎవరున్నారు !!

పూర్వం ఒకనాడు శ్రీమహావిష్ణువు పోగొట్టుకున్న చక్రాయుధాన్ని పొందడానికి పరమశివుని 1008 పద్మములతో సహస్రార్చన చేయడం ప్రారంభిస్తే, విష్ణువును పరీక్షించడానికి శివుడు ఒక పద్మాన్ని మాయం చేస్తారు, అప్పుడు ఆఖరి పద్మం అక్కడ కనబడకపోతే, విష్ణువు పుండరీకాక్షుడు కదా ఆయన కన్నులే పద్మముల వలె ఉంటాయి కదా కాబట్టి ఆయన ఎడమ నేత్రాన్నే తీసి పద్మంగా శివలింగముపై వేసి పూజ చేశాడు హరి. తత్ఫలితముగా విష్ణువుకి సుదర్శన చక్రాయుధాన్ని ప్రసాదించాడు పరమశివుడు. ఇలా పూజ చేసిన ఆ శివలింగాన్ని ‘నేత్రార్పణేశ్వర లింగము’ అని పిలుస్తారు. ఈ క్షేత్రం ఇప్పటికీ తమిళనాడులోని ‘తిరువీళిమిళలై’ అనే ఊర్లో తిరువారూరు దగ్గరలో కొలువై ఉంది. ఇక్కడ అయ్యావారిని కళ్యాణసుందరేశ్వరుడు అనీ, అమ్మవారిని సుందరకుశాంబిగై అనీ పిలుస్తారు. ఈ క్షేత్రములోనే అమ్మవారు కాత్యాయినీ అమ్మవారిగా వచ్చి పరమశివుడిని పరిణయమాడింది. ఈ క్షేత్రంలోనే అప్పార్, సంబంధార్, సుందరార్ అనేక పత్తిగాలు చేశారు. ఈ క్షేత్ర వైభవం చెప్పుకోవాలంటే చాలా ఉంది. కనుక నేత్రార్పణేశ్వర లింగము ఉన్న ఈ క్షేత్రవైభవం మరొక ప్రత్యేక టపాలో పంచుకుంటాను.

ఆదిశంకరులు ఈ శ్లోకములో ‘పురరిపుమపి’ అని త్రిపురాసుర సంహారాన్ని ఉటంకించారు కదా. త్రిపురాసుర సంహారం గురించి మహాశివపురాణం నుండి లఘువుగా ఇక్కడ స్మరిద్దాము.

త్రిపురాసురసంహారముః        
 ​
        
పూర్వము తారకాసుర సంహారము చేయడానికి శివశక్తుల కలయికతో శరవణతటాకము(రెల్లుదిబ్బల) నుండి ఆరుముఖములతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి జననం జరగడం, షడాననుడు దేవసేనాద్యక్షుడై తారకాసుర సంహారం చేసిన ఘట్టం అందరికీ తెలిసినదే. తారకాసురుడికి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఒకడి పేరు తారకాక్షుడు, రెండోవాడు కమలాక్షుడు, మూడో వాడు విద్యున్మాలి. అయితే ఈ ముగ్గురు వాళ్ల తండ్రి మరణం తర్వాత కూడా నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోలేదు. తారకాసురుడిలానే వీళ్ళు కూడా అనంత శక్తులకోసం మరణం లేకుండా ఉండాలని సాధారణంగా అందరు రాక్షసులూ కోరుకునే విధంగా ఉగ్ర తపస్సు చేయడం ప్రారంభించారు. వీరి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే ‘మరణం ఉండకూడదు’ అని అడుగుతారు. దానికి బ్రహ్మగారు ‘ఇది కుదరదు, ఎవరైనా సరే పుట్టడం అంటూ ఉంటే మరణం అనేది తప్పదు కాబట్టి ఇంకేమైనా కోరుకో’మని చెప్తారు. సరే అని ఈ ముగ్గురు రాక్షసులు రెండు వరములు అడుగుతారు. ఒకటి బ్రహ్మగారు సృష్ఠిలోని ఈ లోకంలో ఎవరిచేతా వారికి మరణం రాకూడదు అని. రెండవ కోరిక వాళ్ళకి బంగారము, వెండి, ఇనుములతో చేసిన మూడు పురములను ఇమ్మని. ఈ పురముల సహాయముతో ఈ బ్రహ్మాండములో ఎక్కడైనా విహరించగలిగేలా ఉండి, కొన్ని లక్షల సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే ఈ మూడు పురములు ఒకే సరళరేఖలోకి వచ్చేట్లుగానూ, అలా ఒకే రేఖలో ఉన్నప్పుడు + చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉండగా + అభిజిత్ లగ్నం ఉండగా + ఆకాశంలో పుష్కలావర్త మేఘం నుండీ వర్షం పడుతూ ఉండగా + దైవగణములందరికన్నా గొప్పవాడు + లోకంలో ఎవరూ ఉపయోగించని ఒక కొత్తరథం ఎక్కి + ఒకే ఒక్క బాణం వేస్తే అప్పుడు మాత్రమే మేము ముగ్గురము ఒకేసారి మరణిస్తాము అని కోరుకుంటారు. బ్రహ్మగారు సరే అని వరమిస్తారు.

ఇక లోకంలో వీళ్ల ఆగడాలకి అంతులేకుండా పోవడంతో దేవతలు, మునులు వెళ్ళి బ్రహ్మ గారికి మొరపెట్టుకోగా, శ్రీమహావిష్ణువు సృష్ఠించిన ‘అరిహన్’ అనే గురువు రూపంలో వెళ్లి, త్రిపురాసురులకి ధర్మవిరుద్ధమైన వితండవాదముతో కూడిన తత్త్వాన్ని బోధచేయడంతో, అప్పటిదాకా చేస్తూ ఉన్న ఉగ్ర తపస్సు పూజలు అన్నీ ఆపేసి, ఇంకా దురాగతములు చేయడం ప్రారంభిస్తారు ఈ ముగ్గురు రాక్షసులు. (ఇక్కడ చిన్న ధర్మసూక్ష్మము ఏమిటంటే – ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అధర్మం చేయడం తప్పుకాదు. దానికోసమే శ్రీమహావిష్ణువు సృష్ఠించిన ఈ అరిహన్ అనే గురువు వెళ్లి త్రిపురాసురులకు ధర్మంలా అనిపించే అధార్మిక తత్త్వాన్ని బోధచేశారు. తదనుగుణంగా సంహరింపబడడానికి వాళ్ల పాపం పక్వానికి వచ్చింది. కాబట్టి ‘అరిహన్’ అనే రూపము మనందరము ఆచరించకూడని గురుస్వరూపము).

ఇక ఈ త్రిపురాసురులను సంహరించవలసిన సమయము ఆసన్నమయిందని విష్ణువు, బ్రహ్మాది దేవతలు వెళ్ళి పరమశివుని కోరగా, పరమశివుడు సరేనని అంగీకరిస్తారు. అప్పుడు ఈ పృథ్వియే రథంగా సూర్య చంద్రులు ఆ రథానికి చక్రాలుగా నాలుగు వేదములు అశ్వములుగా మేరు పర్వతము ధనుస్సుగా, ఆదిశేషుడు వింటినారిగా సాక్షాత్తు విష్ణువు బాణముగా, అగ్ని దేవుడు ఆ బాణము యొక్క శిఖగా సిద్ధమవ్వగా, పరమశివుడు ఒక చిరునవ్వు నవ్వి, సరేనని ఆ రథాన్ని అధిరోహిస్తారు. అంతట ఆ రథం ముందుకు వెళ్లలేక నేలకొరిగిపోతుంది. ‘యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ’ అని కదా వేదం. అలాగే పరబ్రహ్మాన్ని వహించడం సాధ్యపడదు కదా. అందుకే రథం ముందుకు వెళ్లలేదు. అప్పుడు పరమశివుడికి అభేదమైన విష్ణువు వృషభరూపం ధరించగా, ఆయనయే బాణముగా కూడా మారి శివుని చేతిలోకి వస్తే, అప్పుడు త్రిపురాసురులను ఒకే ఒక బాణముతో సంహరించెను. తమిళనాడులో కడ్డలూరు జిల్లాలోని పన్ఱుటి అనే ఊరి దగ్గరలో ‘తిరువాడిగై’ అనే క్షేత్రం ‘త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. ఇక్కడ స్వామి వారు వీరట్టేశ్వరస్వామి గానూ, అమ్మవారు త్రిపురసుందరీ అమ్మవారి గానూ కొలువై ఉన్నారు. ఇక్కడే స్వామి వారిని త్రిపురారి, త్రిపురాన్తక అని పిలుస్తారు. ఈ క్షేత్రవైభవాన్ని మరింత విపులంగా మరొక టపాలో చర్చించుకుందాము.

అమ్మవారి అనుగ్రహం పొందిన మన్మథుడుః
ఈ శ్లోకములో చివర రెండు పాదములలో శంకరులు అన్నారు – “స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్” అని. స్మరోపి అంటే స్మరుడు కూడా. స్మర అంటే కామానుభూతిని మరల మరల జ్ఞప్తిలో ఉండేలా మనసును మథించేవాడు – మన్మథుడు అని అర్ధం. “స్మరోపి - మన్మథుడు కూడా” అని అనడంలో అర్ధం మన్మథుడు కూడా హరి వలె అమ్మవారి గొప్ప ఉపాసకులలో ఒకరిగా చెప్తున్నారు. శ్రీవిద్యాసాంప్రదాయములో మన్మథుడు ఇచ్చిన విద్యనే కాదివిద్యగా వ్యవహరిస్తారు. లోపాముద్ర అమ్మ ద్వారా వచ్చినది హాది విద్యగా పేర్కొంటారు.

మన్మథుడు కూడా అమ్మవారిని ఆరాధించిన ఫలితముగా రతీదేవి కన్నులకు మాత్రమే సుందరముగా కనబడతాడు, ఇతర ప్రపంచానికంతటికీ ఆయన స్థూలరూపములో కనబడడు. అందుకే ఆయనను అనంగుడు – అనగా అంగములు లేనివాడు అని పిలుస్తారు. అసలు మన్మథుడికి శరీరం ఎలా పోయింది అంటే తారకాసుర సంహారం జరగాలి అంటే శివశక్తుల కలయికతో వచ్చే తేజస్సు మాత్రమే సంహరించగలదు. శివశక్తులు కలవాలంటే శివుడికి కామం కలగాలి, కాబట్టి ఇంద్రాది దేవతలందరూ ప్రోత్సహించి, తపస్సు చేసుకుంటున్న పరమశివుడికి కామప్రచోదనం కలిగించమని మన్మథుడిని ప్రేరేపిస్తారు. అప్పుడు కామవికారమును కలిగించే పుష్పబాణము వేద్దామని మన్మథుడు సంసిద్ధమవ్వగా అంతట పరమశివుడు ఆయన యొక్క మూడవ కంటి మంటతో కాముడ్ని చూడగా, మన్మథుడు భస్మం అయిపోయాడు. అప్పుడు రతీదేవి అమ్మవారిని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించగా, అమ్మవారు మన్మథుడిని తిరిగి బ్రతికించి, ఆయనకి శరీరం లేకుండా, కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే కనబడే వరాన్ని ఇచ్చారు. అప్పటినుంచీ మన్మథుడిని అనంగుడు/దేహము లేని వాడు అని పిలువబడుతున్నాడు.

ఇక్కడ రతీ మన్మథులు అంటే తత్వం పరిశీలిస్తే  - ప్రతీ వ్యక్తిలో ఉండే కోరిక/ఆసక్తి/కుతూహలమునకు ప్రతీక మన్మథుడు. కోరిక తీరడం ద్వారా పొందే అనుభూతియే రతీదేవి. ఒకరికి మామిడిపండు తినాలని అనిపించడం మన్మథబాణం పడడం. పండు తిన్నాక వచ్చే తృప్తి అనుభవంలోకి రావడం రతీదేవి. అంటే ఆ కోరిక ఫలించినదో లేదో ఆ అనుభవము ఒక్క రతీదేవి కన్నులకు తప్ప ఇతరులకు తెలియదు. అందుకనే మన్మథుడు కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే కనబడతాడు అని శంకరులు చెప్పడంలో అంతరార్ధం.

అటువంటి మన్మథుడు అమ్మవారి ఆరాధన చేసిన ఫలితముగా, లోకములో తపస్సు చేసుకునే మునులకు సైతం వారి మనస్సులలో కామవికారాన్ని, మోహాన్ని కలుగజేయడంలో మన్మథుడు సమర్ధుడగుచున్నాడు.

అయితే ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. అసలు పరమశివుడి మూడవకంటి మంటకి కాలిపోయిన మన్మథుడిని మళ్లీ అమ్మవారు ఎందుకు బ్రతికించారు. సరే బ్రతికించారు అనుకున్నా, ఆ మన్మథుడు లోకంలో అందరినీ ఆయన యొక్క పుష్పబాణములు వేసి మోహాన్ని, కామాన్ని కలుగజేయడం ఎందుకు? అని సందేహం మనకి కలుగవచ్చు. దీని వెనుక రహస్యం ఏమిటంటే – లోకంలో సకల జీవకోటికి కోరికలు లేకపోతే అనగా కామవాంఛ లేకపోతే జగత్తంతా నిర్వీర్యమైపోతుంది, జీవులయందు పునరుత్పత్తి ఉండదు. జీవులు ఉత్సాహాన్ని కోల్పోతాయి. అలాగే ఇతఃపూర్వం కర్మలను అనుభవించడానికి జీవులు తిరిగి తిరిగి వివిధ ఉపాధులలో జన్మించాలి. ఇవన్నీ చేయాలంటే మన్మథుడు లోకానికి అవసరం. కాబట్టి, అటు పరమశివుడి మూడవకంటి మంటకి కాలిపోయిన శరీరాన్ని తిరిగి ఇవ్వకుండా, రతీదేవి కంటికి మాత్రం కనబడే వరాన్ని అమ్మవారు ఇచ్చారు. అప్పటి నుంచీ మన్మథుడు కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే అనుభవం అవుతూ, లోకంలో అందరి మీదా అందునా తపస్సు చేసుకొనే మునుల మనస్సులలో సైతం మోహాన్ని కలుగజేయగలుగుతున్నాడు అంటే అది అమ్మవారి అనుగ్రహం వలన మాత్రమే. మౌనముగా ఉన్న మునీశ్వరులకి కూడా కామాన్ని/మోహాన్ని కలిగించడం మన్మథుడు చేయగలుగుతున్నాడు అంటే, అది పరాదేవత యొక్క అనుగ్రహం మన్మథుడికి ఉండడం వల్ల మాత్రమే. అసలు శరీరమే లేని మన్మథుడు ఎలా లోకాల్ని జయించగలుగుతున్నాడో, ఆయన ఆయుధాలు, ఆయన బలం ఏమిటో ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఆరవ శ్లోకంలో (ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా… ) అద్భుతంగా వర్ణించారు. ఆ శ్లోక వివరణ వ్రాసుకునేటప్పుడు మన్మథుడు ఎలా లోకాలని జయిస్తున్నాడో తెలుసుకుందాము.

లలితాసహస్రనామస్తోత్రములోని ‘వైష్ణవీ’, విష్ణురూపిణీ, ‘విష్ణుమాయా’, ‘విలాసినీ’ అనే నామములతోనూ మరియు లలితాష్టోత్తరశతనామావళిలోని ‘అనంగజనకాపాంగవీక్షణాయై నమః’ అనే నామాలతోనూ ఈ ఐదవ శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు.

సౌందర్యలహరిలోని ఈ ఐదవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే, భార్యా భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనీ, ప్రత్యేకంగా స్త్రీ ఆమె భర్త యొక్క ప్రేమాభిమానన్ని పొందగలుగుతుంది (ఆమె యొక్క పురుషుడు అనగా భర్త ఆమె వశం అవుతాడు) అనీ పెద్దల వ్యాఖ్యానము.


 సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

19, జనవరి 2015, సోమవారం

విహితాచరణప్రశంసా నిషిధ్ధాచరణనిందా చ (మహానారాయణోపనిషత్)

శ్రీ గురుభ్యో నమః

కామాక్షీ పరదేవతానుగ్రహంతో, మహానారాయణ ఉపనిషత్ కొన్ని అనువాకములు ఈరోజు పారాయణ చేస్తూ ఉంటే, పదకొండవ అనువాకములోని విహితకర్మాచరణ ప్రశంసా నిషిద్ధాచరణనింద గురించి వివరించే అద్భుతమైన ఈ క్రిందిమంత్రము నాకెందుకో మరల మరల స్మరించి గుర్తు పెట్టుకోవాలనిపించింది. ఈ మంత్రమునకు మా వేదం గురువు గారు చెప్పిన అర్ధాన్ని, ఇతర పుస్తకముల నుంచి చదివిన అర్ధాన్ని కలిపి ఒకచోట వ్రాసుకుని ఇంట్లో ఎదురుగా కనబడేలా పెట్టుకోవాలని వ్రాసుకుంటున్నాను.

II విహితాచరణప్రశంసా నిషిధ్ధాచరణనిందా చ (మహానారాయణోపనిషత్ - 11వ అనువాకము ) II

యథాI వృక్షస్యI సంపుష్పిIతస్య దూరాద్గన్ధో వాIIత్యేవం పుణ్యIస్య ర్మణోI దూరాద్గన్ధో వాIతి యథాIసిధారాం ర్తేIహితామక్రామే యద్యువే యువే హవాI విహ్వయిIష్యామి ర్తం పIతిష్యామీత్యేమృతాIదాత్మానంI జుగుప్సేIIత్ II 11 II
  
ఈ మంత్రానికి అర్ధం ఏమిటంటే - ఏ విధముగా బాగుగా పుష్పించిన వృక్షము నుండీ చాలాదూరం వరకు

సుగంధము వ్యాపించునో అదే విధముగా, జ్యోతిష్టోమాది పుణ్య కర్మలను చేయుట వలన వచ్చెడి కీర్తి 

కూడా బహుదూరము వరకు వ్యాపించును. అలాగే, ఒక బావి లేదా పెద్దనీటిమడుగు ఉండి ఆ బావి/

మడుగుపైన బాగా పదునైన కత్తులను (అసిధార అని అంటారు) ఉంచి, అప్పుడు ఆ బావిని/మడుగుని 

దాటవలసి వస్తే, అప్పుడు మనలో మనము కత్తులు గుచ్చుకుంటే కాలుకోసుకుంటుంది లేక 

బావిలో పడిపోతాము అని ఏ విధంగా చింతిస్తామో అలా, ఆంతరములోనూ, బాహ్యములోనూ 

పాపచింతన లేక పాపకర్మములను చేయు ప్రవృత్తి/మానసిక దౌర్బల్యము కలవాడు, తనని తాను 

అసిధార నుండి మరియు గర్తము నుండీ కాపాడుకొంటూ బావి దాటాలని ఎలా అనుకుంటాడో అదే 

విధముగా మోక్షార్ధి అయినవాడు అంతర బాహ్య పాపముల యెడల విముఖతని పొందవలెను.


ఉద్ధరే దాత్మానమాత్మాన మాత్మాన మవసాదయేత్ 

ఆత్మైవ హ్యాత్మనో బంధువ రాత్మైవ రిపురాత్మనః II  

తనను తానే బాగుచేసుకోవాలి. తనను తాను నిందించుకుని పాడుచేసుకోరాదు. తాను చెప్పినట్లు వినే 

అంతరాత్మ తన మితృడు అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లుగా, మహానారాయణోపనిషత్ లో 

పైన సూచించిన మంత్రాన్ని బాగా స్మరణ చేసుకుని, విహిత కర్మాచరణము నందు ఆసక్తిని, 

ఉత్సాహాన్ని, పూనికను పొంది, బావి దాటేటప్పుడు అసిధార+గర్తము లను చూసి ఎట్లా చింతిస్తామో

అలానే నిషిద్ధకర్మాచరణము నందు ప్రయత్నపూర్వకముగా విముఖత పొంది, ఇటు ఆంతరములోనూ, 

అటు బాహ్యములో కూడా పాపములను చేసే ప్రవృత్తిని వీడి మనల్ని మనమే ఉద్ధరించుకొనే దిశగా, 

మోక్షంవైపు అడుగులు వేద్దాము. 

ఆపైన, కామాక్షీ అమ్మవారే మంచి బుద్ధిప్రచోదనం ఇచ్చి మనకి ఎక్కడా పాదములలో కత్తులు

గుచ్చుకోకుండా, బావిలోనూ పడిపోకుండా మన మనసు/కర్మలు పాపపంకిలం అవకుండా బావి

దాటగలిగే శక్తినీ, మనోబలాన్ని ఇచ్చి, మనచేత విహిత కర్మాచరణ సత్కర్మలు/పుణ్యకర్మలు చేయించి, 

ఇహము నందు సుఖాన్ని పరము నందు పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యాన్ని కటాక్షించాలని 

కోరుకుందాము !!


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

7, జనవరి 2015, బుధవారం

కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము - అమ్మవారి పాదపద్మముల మహిమ

శ్రీగురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము - అమ్మవారి పాదపద్మముల మహిమ II

త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా I
భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికమ్
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ II 4 II

 తాత్పర్యముః అమ్మా! సకల లోకములకు శరణ్యము/దిక్కైన ఓ జగదంబికా! నీవు తప్ప ఇతరములైన దేవతాగణములు అందరూ, వారి వారి భక్తుల యొక్క కోర్కెలు తీర్చుటకు వామహస్తముతో వరద ముద్ర, అలాగే భయమును తీర్చుటకు కుడివైపు చేతితో అభయ ముద్ర పడతారు తల్లీ, కానీ నీవు మాత్రం ఆ విధంగా వర, అభయ ముద్రలను ప్రకటించవలసిన అవసరం లేకుండా, భక్తుల యొక్క భయమును తీర్చుటకైనా, అలాగే భక్తులు కోరిన దానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇవ్వడానికైనా, పరమపావనమైన నీయొక్క చరణములే సమర్ధములై ఉన్నాయి అమ్మా!


భావార్ధముః  ఈ శ్లోకములో అమ్మవారి యొక్క చరణకమలముల యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు శంకరులు. మొదటగా ఇక్కడ అమ్మవారిని ‘శరణ్యే లోకానాం’ అని సంబోధించారు. అంటే సకల భువనభాండాలకి కూడా అమ్మవారే దిక్కు. సకల జీవకోటికి, దేవతలకు సైతం శరణ్యం అమ్మవారే. అంటే అమ్మవారు పరాశక్తి స్వరూపిణి కదా. అమ్మవారు అనుగ్రహించకపోతే, యావత్ జగత్తు అస్థిత్వం కోల్పోతుంది. ఇక దేవతలకైనా సరే – అమ్మవారి శక్తి లేకపోతే, బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా వారి కర్తవ్యములను నెరవేర్చలేరు. ఆఖరికి అమ్మ శక్తి లేకపోతే, సాక్షాత్ పరమశివుడే అయినా స్పందించలేడు అని శంకరులు అమ్మవారి శక్తి వైభవాన్ని మొదటి శ్లోకములోనే వివరించారు. శరణ్యే లోకానాం అంటే, జగజ్జనని అయిన అమ్మవారి పాదములు సకల లోకాలకు దిక్కు.

అమ్మవారు తప్ప ఇతరములైన దేవతాగణములందరూ వారి భక్తులను అనుగ్రహించడానికి వరదముద్ర, అభయ ముద్రలను అభినయిస్తున్నారు అని చెప్తున్నారు శంకరులు. భగవత్స్వరూపములు భక్తులను అనుగ్రహించడానికి, వివిధ ముద్రలను, ఆయుధాలను చేత పట్టుకుని ఉంటారు. ఉదాహరణకి బాలాత్రిపుర సుందరీ అమ్మవారు ఆమె నాలుగు చేతులలో ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతితో అభయ ముద్ర, మరొక చేతిలో వరద ముద్ర పట్టుకుని ఉంటుంది. అలాగే, దుర్గా అమ్మవారిని చూస్తే, అమ్మవారు త్రిశూలము, ఖడ్గము, శంఖము, పద్మము, గద, ధనుస్సు పట్టుకుని, కుడి చేతితో అభయముద్రని పట్టి ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి వారిని చూస్తే, ఆయన చతుర్బాహువులలో, ఒక చేతిలో ఢమరుకము, జపమాల, అగ్నిశిఖ, పుస్తకము ధరించి, కుడిచేతితో చిన్ముద్ర పట్టి ఉంటారు. ఇలా ప్రతీ దేవతా స్వరూపానికీ, ఒక్కో సగుణరూపమును, ప్రతీ రూపము/అవతారముకి ఒక్కో విధమైన ముద్రలు మరియు ఆయుధములు ధరించి ఉండడం మనం చూసి ఉంటాము. భక్తులను వివిధ రీతులలో రక్షించడానికి, మన కామ్యములు తీర్చుటకొరకు, మనలోని అంతఃశత్రువులను జయించడానికి, దుష్ట శిక్షణ –శిష్ట రక్షణ చూపడానికి సంకేతముగా ఈ ముద్రలుగానీ, ఆయుధములు కానీ భగవంతుడు ధరిస్తాడు. సౌందర్యలహరిలోని నాలుగవ శ్లోకం యొక్క భావార్ధం వివరించేటప్పుడు, మొత్తం ముద్రల గురించి, ఆయుధముల గురించిన వివరణలోకి వెళితే బాగా ఎక్కువ వ్యాఖ్యానం అవుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం అభయ, వరద ముద్రలను గురించి మాత్రం పెద్దల వ్యాఖ్యానము నుంచి తెలుసుకున్నది వ్రాస్తున్నాను.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – లలితా పరాభట్టారికా స్వరూపంలో ఉన్న అమ్మవారు నాలుగు చేతులలో పాశము అంకుశము, చెరుకు విల్లు, ఐదు పుష్పాలు మాత్రమే పట్టుకుంటుంది తప్ప, ముద్రలు ఏమీ పట్టదు. అమ్మవారి నాలుగు చేతులలో ఉన్న పాశాంకుశపుష్పబాణముల ప్రాశస్త్యం గురించి సౌందర్యలహరిలో రాబోయే శ్లోకాలలో శంకరులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వాటి వివరణ కూడా ఇక్కడ ప్రస్తావించడం లేదు.

ఎవరైనా దేవతా మూర్తి వరద ముద్ర పడితే దానర్ధం – భక్తుల యొక్క కామ్యార్ధములను తీర్చగల సమర్ధతను వ్యక్తం చేయుట. అంటే ఇది పోషణ శక్తిని సూచిస్తుంది. అమ్మవారు వామభాగమునందు ఉంటుంది కనుక, వరద ముద్ర ఎడమ చేతితో పడతారు.

అలాగే, అభయ ముద్ర అంటే – భయమును తీసివేయునది, రక్షణ కలిగించునది. భయం దేనికి – ఉన్నది పోతుందేమో, లేనిది రాదేమో అనే భయం దగ్గర నుంచి, అందరికీ ఉండే అతిపెద్ద భయం మృత్యు భయం. మృత్యుభయం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానం వల్ల, ఈ శరీరమే నేను అనే తాదాత్మ్యత ఉండి, ఈ శరీరం ఒకనాడు పడిపోతుంది అని తెలిసినా, శరీరం వెళ్ళిపోతుందంటే, ఇక నేను ఉండను అనే భయం. మరి మనకి ఉండే ఆ భయాన్ని భగవంతుడు ఎలా తీసేస్తాడు? అభయ ముద్ర పట్టి, “ఒరేయ్ నాన్నా నీకేమీ భయం లేదురా, నిన్ను నేను రక్షిస్తాను, జ్ఞానభిక్ష పెట్టి మన భయాన్ని తీసేస్తారు”. ఇదే అభయ ముద్ర. ఇది రక్షణ సామర్ధ్యం కాబట్టి కుడి చేతితో ఈ ముద్ర పడతారు.

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం కూడా,  శుక్ర, కుజ గ్రహములు స్త్రీ తత్త్వమును, పురుష తత్త్వమును సూచిస్తాయి. శుక్ర గ్రహం సంపద కారకం, కుజ గ్రహం సత్త్వమును సంకేతిస్తాయి. శుక్ర గ్రహానికి సంకేతం మరియు కుజ గ్రహానికి సంకేతం పరస్పరం వ్యతిరేకముగా ఉంటాయి. కాబట్టి, వరద ముద్ర ఎడమ చేతితోనూ, అభయముద్ర కుడి చేతితోనూ సమన్వయము కుదురుతోంది కదా.

ఈ నాలుగవ శ్లోకములో శంకరభగవత్పాదుల వారు అంటున్నారు – “అమ్మా!! ఇతర దేవతా గణములు ఆ విధంగా ఒక చేతితో వరద ముద్ర ఒక చేతితో అభయముద్ర పడతారమ్మా, కానీ నీవు మాత్రం అలా అభినయించవలసిన అవసరం లేదు తల్లీ, నీ చరణ కమలములే ఆ రెంటినీ ఇవ్వడానికి సమర్ధమై ఉన్నాయి” అని. అంటే అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తే చాలు, అమ్మ పాదములే మనకి అభయమును, మరియు వరప్రదానము రెండూ ఇవ్వగలవు. అమ్మవారి పాదముల నుంచి వచ్చే కాంతి ఒక్కసారి మనమీద పడిందా, వాడికి జ్ఞానము కలిగి, భయం అన్నది పోయి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివసాయుజ్య స్థితిని కలుగజేస్తుంది అమ్మ. అలాగే, అమ్మవారి పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తే చాలు, ఇహములో మనకి కావలసిన సకల కామ్యములు అమ్మ ఇస్తుంది.

దేవతలలో కొందరు భోగాన్ని, కొందరు మోక్షాన్ని మాత్రమే ఇస్తారు. కానీ అమ్మవారి చరణకమలములను నమ్మిన వాడికి అమ్మ ఇహములో భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి, పరములో మోక్షసుఖాన్ని కూడా ఇవ్వగలదు.

లలితాసహస్రనామస్తోత్రంలో ‘వాంఛితార్థప్రదాయినీ’ అనే నామం ఇచ్చారు వ్యాసుల వారు. శంకరులు ఇంకా ముందుకు వెళ్ళి, ‘భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం’ అన్నారు. అంటే అమ్మ పాదములు భయాన్ని తొలగించి, మనం కోరినదానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని. నిజమే కదా! లౌకికమైన మనల్ని కన్న అమ్మే, మనకి ఏదైనా ఇవ్వల్సి వస్తే, అన్నం పెట్టడం దగ్గర నుంచి, ఏదైనా సరే, మనం అడిగిన దాని కంటే, కోరిన దాని కంటే ఎక్కువ కొసరి కొసరి బలవంతపెట్టి మరీ తినిపిస్తుంది. మరి సకల జీవకోటికి మాత, జగదంబిక మనం కోరిన దానికంటే ఎక్కువ ఫలాన్నిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏముంది!

ఒకసారి పూజ్య గురువు గారు అమ్మవారి యొక్క మాతృప్రేమ చెప్తూ ఒక మాట చెప్పారు. “అమ్మవారిని నమ్మిన వాడికట – అమ్మవారు ఇహములో కావలసిన అన్నీ ఇచ్చి, పుత్రపౌత్రాదులను సుఖశాంతులను అనుభవైక ఐశ్వర్యమును, యశస్సును ఇచ్చి, సంపూర్ణ ఆయుర్దాయము ఇచ్చి, అంత్యమున పరమశివుడితో కలిసి, మోక్షం ఇవ్వడానికి వచ్చి, అమ్మవారితో అయ్యవారితో కలిపి పుష్పకవిమానం ఎక్కించుకుని, తీసుకువెళుతూ ఉంటే, అమ్మవారు మెల్లగా ఓ ప్రక్కకి ఒదిగి, కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటుందిట… ఎందుకు పార్వతీ అని అయ్యవారు అడిగితే, “పాపం వాడు నా పాదాలను నమ్ముకుంటే, నేను వాడికి ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోతున్నానండీ” అని చెప్పి, తన పాదాలనే నమ్మిన ఆ భక్తుడికి ఇహము+పరములో రెండిటిలోనూ అన్నీ ఇచ్చినా, అమ్మవారు తృప్తి చెందరుట. ఇంకా నేను ఏమి ఇవ్వగలను వాడికి అని !!

                
​                   శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అంటే శంకరులు ‘దాతుం ఫలమపిచ వాంఛా సమధికం’ అని ఎందుకు అమ్మవారి పాదపద్మ మహిమని వివరించారో అర్ధం అవుతుంది కదా!!

ఈ శ్లోకముని, లలితాసహస్రంలో ఇచ్చిన ‘వాంఛితార్థప్రదాయినీ’, ‘భయాపహా’, ‘వరదా’, ‘నిరపాయా’ అనే నామాలతో కలిపి అనుసంధానం చేసుకుని చదువవచ్చు. అంతేకాక ఈ శ్లోకము నందు శ్రీవిద్యా సాంప్రదాయములోని బాలమంత్రము నిగూఢంగా ఇచ్చారని పెద్దల వ్యాఖ్యానము.


ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే ‘సామ్రాజ్య సిద్ధి’, మోక్షసిద్ధి కలుగుతాయి.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

2, జనవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 3వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ

శ్రీ గురుభ్యో నమః


II కామాక్షీ సౌందర్యలహరి – 3వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ II
అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ I
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి II 3 II

తాత్పర్యముః అమ్మా! నీ పాదధూళి ఎంత మహిమాన్వితమైనది అంటే - ఊహాత్మకముగా సముద్రగర్భములో ఉన్న ఒక ద్వీపనగరము ఉండి, అందులోంచి పైకి అప్పుడే ఉదయిస్తున్నట్లు కనబడు సూర్యభగవానుని కిరణములు ఏ విధంగా చీకట్లను పారద్రోలునో అలా, నీ యొక్క (అంటే అమ్మవారి) చరణకమలములనంటిన పాదధూళి మహిమ, మాలోని అజ్ఞానమును (అవిద్యను) నశింపచేయును. అలాగే పూవుల గుత్తి నుంచి వచ్చే మధువు యొక్క ప్రవాహము వలె, చైతన్యరహితులు, మందబుద్ధులు, జడులకు, నీ పాదధూళి మహిమ వల్ల జ్ఞానము కలిగి చైతన్యవంతులౌతారు. లేమితనముతో, దరిద్రమును అనుభవించే వారి పట్ల నీపదరజస్సు చింతామణుల వరుసవలె సకల అభీష్టాలను తీర్చగలదు. సంసారసాగరంలో మునిగిన వారిని రక్షించడంలో ముర అనే రాక్షసుడిని చంపిన విష్ణువు అవతారమైన ఆదివరాహమూర్తి కోర వంటిదిమ్మా నీ పాదపద్మములను అంటిన రజస్సు !


భావార్ధముః  ఈ మూడవ శ్లోకములో కూడా అమ్మవారి పాదధూళి మహిమనే ఇంకా విపులంగా వివరించారు ఆదిశంకరులు. ఈ శ్లోకము నాలుగవపాదంలో ‘భవతి’ అనే పదాన్ని అంటే అమ్మవారి నామముగా అన్వయించుకోకుండా, ‘అయిఉన్నది’ అని అర్ధం చేసుకోవాలి. అంటే రెండవ శ్లోకములో ‘తనీయాంసం పాంశుం తవచరణ పఞ్కేరుహభవం’ అని అమ్మవారి యొక్క పాదధూళియే ఇందులో శ్లోకమునకు కూడా ప్రథాన విషయముగా (subject) అర్ధం చేసుకోవాలి.
ఈ శ్లోకంలో ఏ స్థాయిలో ఉన్నవారినైనా అమ్మవారి పాదధూళి ఏవిధంగా కామ్యార్ధములను ప్రసాదించి, గొప్ప తేజస్సుని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, చివరికి జననమరణ సంసార చక్రం నుండి పైకి లేపి మోక్షం వైపు తీసుకువెళ్ళగలదో చెప్తున్నారు శంకరులు. ఇందులో సాధారణంగా మనందరికీ ఉండే సమస్యలను నాలుగు రకాల భూమికలలో ప్రతిపాదించారు. ఒకటి – అవిద్య/అజ్ఞానము, రెండవది – జడత్వం, మూడవది – దరిద్రం, నాలుగవది – సంసారమగ్నత.

ఈ నాలుగు రకాల సమస్యల నుండీ అమ్మవారి పాదధూళి ఎలా రక్షిస్తుందో నాలు ఉపమానాలు వేసి చెప్పారు శంకరులు. ఆ ఉపమానాలు వరుసగా….
1.     అవిద్య/అజ్ఞానానికి à మిహిరద్వీపనగరము
2.     జడులు/చైతన్యరహితులకు à చైతన్యవంతమైన పూవుల మకరంద స్రుతి ఝరీ
3.     దరిద్రమునకు à చింతామణుల వరుస
4.     సంసారమగ్నులకు à ఆదివరాహమూర్తి కోర వంటిది.

ఇందులో ఒక్కో అంశాన్ని బాగా పరిశీలన చేద్దాం. అవిద్య అంటే లౌకికమైన అక్షరాస్యత లేకపోవడం కాదు. మనం చదివే లౌకిక చదువులను కూడా మర్యాదకోసం విద్య అని అంటాము కానీ, మన ఈ లౌకిక చదువులు అసలు విద్య కానేకాదు. ఇవన్నీ కడుపు నింపడం కోసం నేర్చుకునే కొన్ని గారడీలు అంతే. మరి విద్య అంటే ఏమిటి? ఏది తెలుసుకుంటే ఇక ఏమీ తెలుసుకోవలసిన అవసరం ఉండదో అది జ్ఞానము/విద్య. అది లేకపోవడమే అజ్ఞానము/అవిద్య. ఇలా అజ్ఞానములో ఉన్నవారి కొరకు అమ్మవారు మిహిరద్వీపనగరి వంటిది. మిహిర అంటే ద్వాదశాదిత్యులుగా చెప్తారు అవి వరుసగా – ధాత, మిత్ర, అర్యముడు, రుద్ర, వరుణ, సూర్య, భగ, వివస్వత, పూషా, సవితృ, త్వష్ట మరియు విష్ణు.

ద్వీపనగరి అంటే ఈ పన్నెండు మంది సూర్యులు సముద్రగర్భంలో ఒక నగరంలో కొలువై ఉండి, అవి అన్నీ ఒక్కసారి ఉదయించే దృశ్యం ఎలా ఉంటుందో ఊహాత్మకముగా దానిని ‘ద్వీపనగరి’ అని సంబోధించారు శంకరాచార్యులవారు. అటువంటి ద్వీపనగరంలోంచి వచ్చిన సూర్యకాంతి ఎలాగైతే మూలమూలలలో ఉన్న చీకట్లను ఎలా పారద్రోలి వెలుగుని నింపుతుందో, అలా అమ్మవారి పాదధూళి ఎంత శక్తివంతమైనది అంటే, కొన్ని కోట్ల కోట్ల కోట్ల జన్మల తరబడి మనలో నిండిన అజ్ఞానము అనే చీకట్లను తొలగించివేస్తుంది.

    

​ 
ఇలాంటి దృశ్యం కన్యాకుమారిలో సముద్రం దగ్గర సూర్యోదయం చూస్తే బాగా అర్ధం అవుతుంది. నిజానికి సూర్యభగవానుడు అంతరిక్షంలో ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటాడు. ఆయనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు అనేవి ఉండవు. కానీ భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన మరియు భూమి గోళాకారంలో ఉండడం వలన మనకి పగలు, రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. భూమి మీద నుంచి సముద్రం ఒడ్డు దగ్గర నుంచి సూర్యోదయం చూస్తే అప్పుడే ఉదయించే బాలసూర్యుడు ఏ రంగులో కనిపిస్తాడో, అది అమ్మవారు. అందుకే ఎప్పుడూ అమ్మవారు ఎరుపు ఎరుపు అని చెప్తారు పూజ్య గురువు గారు. సూర్యోదయ అరుణకాంతి ఒక్కసారి పడిందా అప్పటి వరకు ఉన్న చీకటి మాయం అయిపోయి, అంతా ఆ ఎర్రని కాంతి వ్యాపిస్తుంది. అలా, అజ్ఞానంలో పడి ఉన్నవారికి అమ్మవారి పాదధూళిని శిరస్సుపై వేసుకున్న మాత్రాన, అమ్మవారు జ్ఞానమును ప్రకాశింపచేస్తారు. పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లలితా సహస్రనామస్తోత్ర ప్రవచనంలో చెప్పారు, ఎవరికి ఇలా ధ్యానములో ఆ ఎరుపు కాంతి కనబడుతుందో, అమ్మవారి అనుగ్రహం కలిగింది అని గుర్తు. లలితాసహస్రనామస్తోత్రంలో ఈ విషయాన్నే వ్యాసుల వారు ‘ఉద్యద్భానుసహస్రాభా’ అనే నామంతో వర్ణించారు.

ఇక రెండవ సమస్య - జడత్వం. అంటే దేనికీ స్పందించకపోవడం. ఈ జడత్వం దేనికి ఉంటుంది? మనసుకి. మనస్సుకి జడత్వం లేకపోతే ఏ పని చెయ్యడానికీ ఉత్సాహం ఉండదు. మనసుకి ఆ జడత్వం పోయి జవం/బలం కలిగి ఉత్సాహం పొందాలంటే అమ్మవారి పాదధూళియే శరణ్యం. అమ్మవారి పాదధూళి ఒక్కసారి మనపై పడిందా అది ‘చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరి’ అవుతుంది అని చెప్పారు శంకరులు. స్తబకము అంటే పూవుల గుర్తి. చైతన్య స్తబక అంటే చైతన్యము కలిగిన పుష్పముల గుర్తి అని. అంటే ఎవరు అమ్మవారి పాదధూళిని శిరస్సుపై వేసుకుంటారో వారి మనస్సు జడత్వం కోల్పోయి చైతన్యం పొంది, ఆ చైతన్యం పొందిన మనసే పుష్పమై అందులో ఎప్పుడూ మకరందం (తేనె)/మంచి భావములు స్రవించే ప్రవాహమై ఉంటుంది.

ఈ విషయాన్నే వ్యాసుల వారు లలితాసహస్రంలో ‘చైతన్యార్ఘ్యసమారాధ్యా’, ‘చైతన్యకుసుమప్రియా’ అనే నామాలతో వివరించారు. చైతన్య పుష్పాలచే అర్చింపబడడం అమ్మవారికి ప్రీతికరము. చైతన్యముతో కూడిన పుష్పములంటే ఇష్టమైనది, చైతన్య పుష్పములచే అర్చింపబడుట అమ్మవారికి ప్రాతి. సాధారణంగా పుష్పాలకు మంచి అందం, సువాసన, మకరందం, మృదుత్వము, మాధుర్యము ఇవన్నీ ఉంటాయి. కానీ చైతన్యము కూడా కలిగిన పుష్పము ఒక్క మన మనస్సే. దీనినే హృత్పద్మం అని సంబోధించారు శంకరులు శివానందలహరిలో.

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో II9
వటుర్వా గేహీవా యతి రపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తే న భవతి
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి II11

పైన ‘గభీరే కాసారే’ అనే శ్లోకంలో శంకరులు అన్నారు --- “ఓ పశుపతీ! స్వామీ! నీకు పూజ చేయడం కోసం అని లోతైన సరస్సులలో దిగి తామరపువ్వులు తెస్తున్నారు, అడవులలోకి వెళ్ళి మారేడు పత్రాలు బస్తాలకొద్దీ తెస్తున్నారు! అలాగే కొండలూ కోనలూ తిరిగి కుసుమాలు తెస్తున్నారు! కానీ ఉమానాథా! ఈ జనులు వాళ్ళ మనస్సనే పుష్పాన్ని నీకు సమర్పిస్తే అన్నిటికన్నా నీవు ఎక్కువ సంతోషిస్తావు అని ఎందుకు తెలుసుకోలేకపోతునారు స్వామీ?
అలాగే వటుర్వా గేహీవా అనే రెండవ శ్లోకంలో శంకరులు అంటారు “నీవు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వటువివా? లేక గృహస్థువా లేక జటలు ధరించిన సన్యాసాశ్రమంలో ఉన్న యతివా లేక మరెవరైనా సరే, నీ మనస్సనే పుష్పాన్ని ఉమానాథుడికి సమర్పించరా, నీ హృత్పద్మం పశుపతి అధీనంలో ఉంచావా, నీ భారాన్ని మొత్తం ఆ శంభుదేవుడే వహిస్తాడు రా”.
అంటే అమ్మవారికి/అయ్యవారికి చైతన్యకుసుమాలంటే ఇష్టం. కాబట్టి మన మనస్సులు చైతన్యం పొంది, అలా చైతన్యం పొందిన హృత్పద్మంతో పరమేశ్వరుడిని అర్చించాలి అంటే మన జడత్వం పోవాలి, అది ఒక్క అమ్మవారి పాదపద్మములనంటిన పరాగముమాత్రమే చేయగలదు. జడత్వం పోవాలంటే అమ్మవారి పాదధూళి, అలాగే హనుమ పాదములు పట్టుకున్నా, మనకున్న జడత్వం పోతుంది – “బుద్ధిర్బలం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్” అని చెప్తారు కదా!!

మూడవ సమస్య – దరిద్రం. సరే, ఇంతవరకు బావుందండీ, కానీ మాకు పూర్వ కర్మఫలం వల్ల దరిద్రం అనుభవిస్తున్నాము, ముందు ఈ దరిద్రం పోతే కదా, అప్పుడు జ్ఞానం గురించి అయినా, మోక్షం గురించి అయినా ఆలోచించగలిగేది అని అనుకుంటారా? అయినా ఏమీ భయం లేదు. ఎవరికి లేమితనం ఉంటుందో, వారికి అమ్మవారి పదరజస్సు చింతామణుల వరుస వంటిది. దరిద్రము/లేమితనము అంటే కేవలం ధనము లేకపోవడం ఒక్కటే కాదు. ఆరోగ్యం, భౌతికమైన ఐశ్వర్యము, సంతానము, బంధు మిత్రులు, యశస్సు, ఉన్నది అనుభవించలేకపోవడం వగైరా వీటిలో ఏది లేకపోయినా దరిద్రమే. ఒక్క చింతామణి ఉంటేనే ఏ కోర్కెలైనా తీరుతాయి. అలాంటిది చింతామణి గుణనికా అని చెప్పారు శంకరులు. అంటే ‘Multiples of Chintamani’ అని. ఎన్ని చింతామణులు అని చూస్తే, ‘గుణనికా’ అనే పదాన్ని సంఖ్యలలోకి మారిస్తే …
గు                ణ                 ని                కా
3                 5                 0                 1
నాలుగు సంఖ్యలను కలిపి చదివితే 3501. కానీ సంస్కృతములో కుడి నుంచి ఎడమకి సంఖ్యలను చెప్తారు. అందుకే 108 నామాలు చెప్పడానికి అష్టోత్తరశతనామస్తోత్రం అంటారు. అలాగే గుణనికా అంటే 1053 అనే సంఖ్య వస్తుంది.
అమ్మవారి పాదధూళి దరిద్రులకు 1053 చింతామణుల మాలయై, వారికి ఇహమునందు కావలసిన వన్నీ సమకూర్చగలదు అని అర్ధం. లలితాసహస్రంలో అమ్మావారి నామాలను 1053 నామాలుగా విడదీసి ‘గుణనికా’ అని వ్యాఖ్యానం చేశారు. ఇట్టి గుణనికా వ్యాఖ్యానాన్ని ‘కళ్యాణ శ్రీకళ’ అనే పేరుతో శ్రీశ్రీశ్రీ కళ్యానానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు ఇతఃపూర్వం వ్రాసి ఉన్నారు. ఒక్క చింతామణి ఉంటేనే, మనకి తీరని కోర్కెలు ఉండవు. అలాంటిది చింతామణి గుణనికా అని శంకరులు చెప్పడంలో అర్ధం, సకల లోకాలలో ఉన్న అన్ని జీవులకి కావలసిన కోర్కెలను అనంతముగా కటాక్షించగల అనంతమైన శక్తి అమ్మవారికి ఉంది. లలితాసహస్రంలో ‘చింతామణి గృహాంతస్థా’ అనే నామంతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఇక నాలుగవ సమస్య – సంసారమగ్నత. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఈ భూమి మొత్తాన్ని చాప కిందచుట్టి సముద్రగర్భంలో దాచేస్తే, అప్పుడు శ్రీమహావిష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి ఆయన యొక్క కోరతో సముద్రంలో మునిగి ఉన్న భూమిని పైకి లేపి రక్షించారు. అలా, ఎవరైతే జననమరణచక్రంలో పడి కొట్టుకుంటూ, పైకి లేవలేక, నిరంతర సంసారమగ్నులై ఉంటారో, వారిని అమ్మవారి పాదధూళి ఆదివరాహ మూర్తి కోర వలే పైకి లేపి, ఇక మళ్ళీ జన్మలు ఎత్తవలసిన అవసరంలేకుండా మోక్షాన్ని కటాక్షిస్తుంది. ఈ అర్ధాన్ని లలితా సహస్రనామస్తోత్రంలో ‘సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా’, ‘జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ’ అనే నామములతో అనుసంధానం చేసుకోవచ్చు.

కామేశ్వరసూరి వ్యాఖ్యానము ప్రకారము త్రిపురార్ణవములో వర్ణింపబడిన ‘త్రయీమయీ విద్య’గా పేర్కొనబడిన వాగ్భవ-కామరాజ-శక్తి బీజములలో మొదటిదైన వాగ్భవ బీజం మరియు కామరాజ బీజము సౌందర్యలహరలోని ఈ మూడవ శ్లోకములో నిగూఢంగా ఇచ్చారు శంకరులు. అంటే ఈ శ్లోకాన్ని బాగా అనుష్టానం చేస్తే, గొప్ప పండితులు, వేదవేత్తలు అవ్వడమే కాక, సకల ఐశ్వర్యాలని కూడా అమ్మవారు కటాక్షిస్తారు.



ఈ శ్లోకం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే వేదవేత్త, గొప్ప పండితులు అవుతారని మరియు ఐశ్వర్యము కావలసిన వారికి ఐశ్వర్యము, మనోజవం కావలసిన చైతన్యవంతులు, ఉత్సాహవంతులు అయి చేపట్టే అన్నికార్యములలోనూ జయం లభిస్తుంది అని పెద్దల వ్యాఖ్యానము. అంతేగాక అమ్మవారి అనుగ్రహంతో ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అనే నాలుగు పురుషార్ధాలనూ పొందగలరు.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.